బుట్టాయగూడెం: బుట్టాయగూడెం శివారు సింగారమ్మపాడు సమీపంలో ఉన్న డిగ్రీ కళాశాల భవనంలో గురువారం ఐటీసీ అధికారులు వైట్ బర్లీ పొగాకు బేళ్లను కొనుగోలు చేశారు. సుమారు 435 బేళ్లు కొనుగోలు చేసినట్లు ఐటీసీ మేనేజర్ జీహెచ్ మంజునాథ్ తెలిపారు. బుట్టాయగూడెం, దొరమామిడి, కుక్కునూరు, తదితర గ్రామాల పరిధిలో ఈ ఏడాది 600 మంది రైతులు సుమారు 1000 ఎకరాల్లో వైట్ బార్లీ పంట పండించినట్లు తెలిపారు. ప్రస్తుతం తాము ఎర్రగా నాణ్యతతో ఉన్న కేజీ పొగాకును రూ. 160కు, లోగ్రేడ్ పొగాకును రూ.100లోపు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. బేళ్ల కొనుగోళ్లు అనంతరం రెండు మూడు రోజుల్లో రైతులకు బేళ్లు అమ్మకాల సొమ్మును జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలో గత ఐదేళ్లుగా వైట్బర్లీ పొగాకును కొనుగోలు చేస్తున్నామని మేనేజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


