అలంకరణలు కూడా చేయలేరా?
క్షీరారామంలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల మండపాల్లో గుమ్మాలకు కనీసం పూల అలంకరణ కూడా చేయించలేని స్థితిలో క్షేత్రం ఉందా అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం ఆమె ఆలయానికి సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి అనంతరం ఆలయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆలయ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయంలో ఈనెల 12 నుంచి శివరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా, ఆలయంలో ఎక్కడా ఉత్సవాల సందడి కనిపించడం లేదన్నారు. ఆలయంలో కనీసం పూల అలంకరణ చేసేందుకు ఆదాయం లేదా అని అసహనం వ్యక్తం చేశారు. ఆలయంలో ఆహ్లాదకరంగా, ప్రశాంత వాతావరణం కనిపించాలని, ఇంత దారుణంగా ఉంచుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తాను హెచ్చరించినా అధికారుల పనితీరులో ఏమాత్రం మార్పు లేదన్నారు. శివరాత్రికి ఆలయంలో అన్నదానం ఏర్పాటుచేయకపోవడం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాతలు ఎవరైనా అన్నదానం చేస్తే వారికి సరైన ప్రదేశం ఏర్పాటుచేయాలని సూచించారు. మహాశివరాత్రికి క్యూలైన్లు, ట్రాఫిక్, శానిటేషన్పై ప్రత్యేక దృష్టికి సారించి పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్డీఓ దాసి రాజు, డీఎస్పీ శ్రీవేద, తహసీల్దార్ యడ్ల దుర్గాకిషోర్, కమిషనర్ బి. విజయసారథి, సీఐ కె.రజనీకుమార్, డీఈఓ హరి సూర్యప్రకాశరావు, ఎస్సై పృద్వీ, ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు ఉన్నారు.
సోమారామంలో పక్కా ఏర్పాట్లు
భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామక్షేత్రం భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయం (సోమారామం)లో పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్లర్ నాగరాణి ఆదేశించారు. శనివారం ఆమె ఆలయాన్ని సందర్శించి శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించారు. క్యూలైన్లు, శానిటేషన్ ఏర్పాట్లను పరిశీలించి అన్నదానం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, సభ్యులు ఆమెకు స్వామి చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.
ఏలూరు (టూటౌన్): మెడికల్, ఫార్మా మా ఫియాను అరికట్టాలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో చేస్తున్న ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ సీపీఐ ఏలూరు ఏరి యా సమితి ఆధ్వర్యంలో శనివారం ఏలూరు పాతబస్టాండ్, అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలని, మెడికల్, ఫార్మా మాఫియాను అరికట్టాలని, మందుల అధిక ధరలను తగ్గించాలని, నకిలీ మందులను అరికట్టాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలందరికీ అవసరమైన విద్య, వై ద్యాన్ని ప్రైవేటుపరం చేయడం ద్వారా కూట మి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 వేల మెడికల్ షాపుల్లో అర్హత లేని వారు ఫార్మసీ సర్టిఫికెట్లు కొనుగోలు చేసి ప్రజలకు అవసరమైన మందులను అధిక ధరలకు విక్రయిస్తూ నకిలీ మందులను సరఫరా చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ ఆస్పత్రులు సొంత మెడికల్ షాపుల నిర్వహణ ద్వారా అధిక ధరలకు మందులు విక్రయిస్తున్నారన్నారు. ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దెందులూరు: ప్రభుత్వ వ్యాయామ కళాశాలలో ప్రవేశాల కోసం ఏపీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీసెట్)కు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని గోపన్నపాలెం ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.నతానియేలు తెలిపారు. ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులకు గడువు ఉందని, రూ.1,000 అపరాధ రుసుంతో మే 15 వరకు, రూ.2 వేల అపరాధ రుసుంతో మే 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 24 నుంచి 28 వరకు దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించారని చెప్పారు.


