దేవుడితో రాజకీయాలు వద్దు
యలమంచిలి: కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా దేవుడితో చేసే రాజకీయాలకు స్వస్తి పలకాలని వైఎస్సార్సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి) హితవు పలికారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడానికి తిరుపతి లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందంటూ విష ప్రచారానికి తెరలేపిందని ఆయన విమర్శించారు. ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలోని ఇతర దేవాలయాల ప్రసాదాలకు ఇదే నెయ్యి వాడినట్లు విష ప్రచారం చేస్తున్నారన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నివేదికలు వచ్చినా కూటమి నాయకులు దానిని జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్పై ప్రజలు ఎంతో ఆశలు పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసారన్నారు. కనీసం ఆయనైనా స్పందించి ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నంత మాత్రాన పవన్ తన శైలిని మార్చుకోవలసిన అవసరం లేదన్నారు. ఆయన ధైర్యంగా ఈ విషయంలో ప్రభుత్వాన్నీ నిలదీసి తన పారదర్శకతను నిరూపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగుతుందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై దాడులు చేయడం అరాచక పాలనకు పరాకాష్టని గోపి విమర్శించారు.


