సీపీఎస్ రద్దు కోరుతూ వినతి
భీమవరం: ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాళ్ల మోహనరావు, గుమ్మల్ల జకరయ్య కోరారు. శనివారం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎమ్మెల్సీ గోపిమూర్తిని కలిసి వినతిపత్రాలు అందజేశా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు అందజేశామన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు, వేతన సవరణ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి తదితర అంశాలపై రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు చేయాలని కోరారు. కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో హామీ మేరకు సీపీఎస్/జీపీఎస్ విధానాలపై పునః సమీక్ష చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, సభలో ప్రస్తావిస్తామని మోషేన్రాజు, గోపి మూర్తి హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. సంఘ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎస్. మానస, భీమవరం తాలూకా అధ్యక్షుడు రవిచంద్ర ప్రసాద్, తాలూకా కార్యదర్శి కె.అప్పారావు, అసోసియేట్ అధ్యక్షురాలు ప్రియదర్శిని, జిల్లా జాయింట్ సెక్రటరీ అస్గర్ అలీ, ఉపాధ్యక్షులు స్వర్ణలత, సునీత, భవానీ, జాయింట్ సెక్రటరీలు ఉన్నారు.


