దర్జాగా దోపిడీ
న్యూస్రీల్
ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
ర్యాంపు జోలికి పోని అధికారులు
గురువారం శ్రీ 18 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి, భీమవరం: ఉచిత ఇసుక మాటున కూటమి నేతలు దర్జాగా దోచేస్తున్నారు. లోడింగ్ చార్జిలు ఇష్టారాజ్యంగా పెంచేసి రూ.నాలుగు వేలు వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బిల్లు లేకుండానే చాలావరకు ఆఫ్లైన్లోనే లోడింగ్ జరిగిపోతుండగా మైనింగ్ అధికారులు ర్యాంపుల జోలికి పోకుండా లారీలపై కేసులు నమోదుచేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సముద్రపు ఉప్పు నీటి సాంద్రతతో జిల్లాలోని ఆరు ఓపెన్ రీచ్లు, ఐదు డిసిల్టేషన్ పాయింట్లు కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలోకి వెళ్లడంతో మూతపడిపోయాయి. ఇసుక కోసం తూర్పుగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని పెండ్యాల, పందలపర్రు, గోపాలపురం తదితర ర్యాంపులకు వెళ్లాల్సి వస్తోంది. పెండ్యాల ఓపెన్ ర్యాంపును ప్రత్యేకంగా జిల్లా అవసరాల కోసం ప్రభుత్వం కేటాయించింది. ఇసుక ఉచితం కాగా లోడింగ్ నిమిత్తం ర్యాంపు నిర్వాహుకులు టన్నుకు రూ.95 చొప్పున ఆరు యూనిట్ల లారీకి రూ.1900 మాత్రమే వసూలు చేయాలి.
బిల్లుకో రేటు
మైనింగ్ శాఖ నిబంధనలు మేరకు ప్రతి ట్రిప్పునకు బిల్లు తప్పనిసరి. లేకపోతే అధికారుల తనిఖీల్లో లారీపై కేసు నమోదుచేసి జరిమానా విధిస్తారు. ర్యాంపులో ప్రస్తుతం బిల్లు లేకుండా అయితే లోడింగ్ చార్జీకి రూ.1900తో కలిపి రూ.4500, బిల్లు కావాలంటే రూ.5,500 వసూలు చేస్తున్నట్టు లారీ యజమానులు చెబుతున్నారు. బిల్లు వద్దంటే రూ.4,500 నగదు వసూలు చేస్తుండగా, బిల్లు కోరిన వారికి రూ.1,900 ఆన్లైన్లో చెల్లించుకుని మిగిలిన రూ.3,600 ఆఫ్లైన్లోను నగదు తీసుకుంటున్నారంటున్నారు. ప్రస్తుతం ఈ ర్యాంపులో తవ్వకాలు చేస్తుండటంతో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో లారీలు ఇక్కడ బారులు తీరుతున్నాయి. కొందరు మాత్రమే రూ.5500 చెల్లించి రూ.1900 లోడింగ్ బిల్లు తీసుకుంటుండగా రూ.వెయ్యి మిగులుతుందన్న ఆశతో అధికశాతం మంది బిల్లు లేకుండా లోడింగ్ చేయించుకుంటున్నట్టు తెలుస్తోంది. రాత్రి వేళల్లో ఇక్కడి ఇసుక తవ్వకాలు, లోడింగ్ జాతరను తలపిస్తూ సాగుతున్నాయంటున్నారు. అదనపు వసూళ్ల రూపంలో రోజుకు రూ.10 లక్షలుపైనే కొల్లగొడుతుండగా వీటిలో కూటమి పెద్దలకు వాటాలు అందుతున్నట్టు తెలుస్తోంది. అదనపు దోపిడీపై ఎన్నో సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని లారీ యజమానులు వాపోతున్నారు. ఈ భారం మొత్తం వినియోగదారులపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక ఉచితమని లోడింగ్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం చెబుతోంది. పెండ్యాల ర్యాంపులో లోడింగ్ చార్జి రూ. 1900కు గాను రూ. 5500 వసూలు చేస్తున్నారు. అదనపు వసూళ్లు ఎందుకోసమో చెప్పడం లేదు. విషయం అధికారులకు చెప్పినా ఫలితం ఉండటం లేదు. ఈ భారం వినియోగదారులపై పడుతోంది.
రావూరి రాజా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు
పెండ్యాలలో ఇష్టారాజ్యంగా ఇసుక ధరలు
వాస్తవానికి 6 యూనిట్ల లారీకి లోడింగ్ చార్జి రూ. 1,900
బిల్లు కావాలంటే రూ. 5,500, లేదంటే రూ.4500కు లోడింగ్
బిల్లు రూ.1,900 మినహా మిగిలిన మొత్తం ఆఫ్లైన్లోనే వసూలు
రోజుకు 150కు పైగా ట్రిప్పులతో రూ.లక్షల్లో దోచేస్తున్న కూటమి నేతలు
దోపిడీ జోలికి పోని మైనింగ్ అధికారులు
కూటమి నేతల ఒత్తిళ్లతో సంబంధిత అధికారులు ర్యాంపు జోలికి వెళ్లడం లేదు. లారీలపై మాత్రం కేసులు రాసి భారీ మొత్తంలో జరిమానాలు వేస్తున్నారని ఓనర్లు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ఇసుకపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వానికి చేరేది. ఇప్పుడు కూటమి పెద్దల జేబుల్లోకి వెళుతోంది. గతంలో బిల్లు లేకపోతే లారీకి రూ.25,000 జరిమానా విధించేవారని, ఇప్పుడు ఇసుక ఉచితం అయినప్పటికి రూ. 25,000 జురిమానా వేస్తున్నారని చెబుతున్నారు. ర్యాంపులో అదనపు వసూళ్ల విషయాన్ని భూగర్భ గనులశాఖ ఏలూరు ఏజీ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
దర్జాగా దోపిడీ
దర్జాగా దోపిడీ


