శ్రీవారి తిరువీధి సేవలు ప్రారంభం
ఉభయ దేవేరులు, గోదాదేవితో ఊరేగిన స్వామివారు
క్షేత్ర పురవీధుల్లో తొళక్క వాహనంపై ఉభయ దేవేరులు, గోదాదేవితో ఊరేగుతున్న శ్రీవారు
ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లకు హారతులిస్తున్న అర్చకులు
ద్వారకాతిరుమల: ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి తిరువీధి సేవలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉభయ దేవేరులు, గోదాదేవితో కలసి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ముందుగా ఆలయంలో అర్చకులు స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. పూజాధికాలు అనంతరం హారతులిచ్చారు. ఆ తరువాత శ్రీవారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పురవీదులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు శ్రీవారు, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన కూడలిలోని ధనుర్మాస మండపంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు.
శ్రీవారి తిరువీధి సేవలు ప్రారంభం


