నారసింహునికి పంచామృతాభిషేకాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుందరగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మంగళవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. నారసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ముందుగా ఆలయ యాగశాలలో వేద పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యహవాచనం, మండపారాధనను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణల నడుమ సుదర్శన నారసింహ, ధన్వంతరీ, గరుడ, ఆంజనేయ, అనంత సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమాలను జరిపారు. గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకాలు నిర్వహించి, నక్షత్ర హారతులిచ్చారు. అనంతరం అన్నసమారాధనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ద్వారకాతిరుమల: గుంటూరు జిల్లా పెదనందిపాడులో గత శనివారం జరిగిన 45వ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో తిరుమలంపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయురాలు పైడి రాజేశ్వరమ్మ సత్తా చాటారు. 60 ప్లస్ ఏజ్ గ్రూప్లో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో రాజేశ్వరమ్మ ప్రథమ బహుమతి, 800 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ బహుమతి, 3 కిలో మీటర్ల నడక పోటీలో ప్రథమ బహుమతిని సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శేషు కుమారి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది రాజేశ్వరమ్మను అభినందించారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) 2026లో డ్రాయింగ్ లోయర్, డ్రాయింగ్ హయ్యర్, టైలరింగ్ లోయర్, హయ్యర్ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైందని, ఇందుకు గాను అభ్యర్థులు ఈనెల 27వ తేదీలోగా ఫీజులు చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుముతో వచ్చే జనవరి 3వ తేదీ వరకూ, రూ.75 అపరాధ రుసుముతో జనవరి 6వ తేదీ వరకూ గడువు ఉందన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, ఫీజు చెల్లించిన చలానా కాపీతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు.
తాడేపల్లిగూడెం: ఇస్రో ఆధ్వర్యంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థులు సత్తా చాటారు. 36 గంటలపాటు నిర్విరామంగా జరిగిన ఈ పోటీల్లో ఏపీ నిట్ విద్యార్థుల బృందం అద్భుత ప్రతిభను కనబర్చి మూడోస్థానాన్ని కై వసం చేసుకుని రూ.50వేల నగదు బహుమతిని అందుకున్నారు. ఫైనల్ పోటీలకు అర్హత సాధించిన 55 టీమ్లలో ఏపీ నిట్కు చెందిన దక్షిణ లోకోవర్స్టీమ్ ఒకటిగా నిలిచింది. ఈ టీమ్లో మొహమ్మద్ నవీద్, బి.సంజయ్, జేకే.సంతోష్, అరవ శివతేజ సత్యశ్రీ, శ్రీహరిసతీష్, లిఖిత రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ టీమ్కు మెంటార్లుగా ఆచార్యులు డాక్టర్ కార్తీక్ శేషాద్రి, డాక్టర్ శ్రీఫణి, డాక్టర్ కార్తికేయశర్మ వ్యవహరించారు. విద్యార్థులను నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి తదితరులు అభినందించారు.
బుట్టాయగూడెం: ఇటీవల అంకన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలిక గర్భవతి అయ్యిందనే నెపంతో బాధ్యులు కాని ప్రధానోపాధ్యాయిని, డిప్యూటీ వార్డెన్లను సస్పెండ్ చేయడం సరైన చర్య కాదని, వెంటనే వారి సస్పెన్షన్ను రద్దు చేసి విధుల్లోకి తీసుకోవాలని ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వేసవి సెలవుల్లో పాఠశాల బయట జరిగిన ఘటనకు బాధ్యులను చేస్తూ ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న వారిని సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు.
నారసింహునికి పంచామృతాభిషేకాలు
నారసింహునికి పంచామృతాభిషేకాలు


