రీసర్వేలో అవకతవకలపై రైతుల అసహనం
కాళ్ల: రీ సర్వేలో అవకతవకలపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూముల్లో విస్తీర్ణం తగ్గడంపై ఉన్నత అధికారులను ఆశ్రయించడంతో వారి ఆదేశాల మేరకు వచ్చిన సర్వే సిబ్బందికి తమగోడును వెళ్లబుచ్చుకున్నారు. రీసర్వేలో తమ పొలాల విస్తీర్ణం తగ్గిందని, ఇది భూమి యాజమాన్య హక్కులను ప్రభావితం చేస్తోందని మండల కేంద్రమైన కాళ్ల గ్రామానికి చెందిన తోట కృష్ణారావుతో పాటు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వాస్తవంగా తమ భూమి క్షేత్రస్థాయిలో సక్రమంగానే ఉందని, తమ దగ్గర అన్ని రికార్డులు ఉన్నా, భూమిలో కొంతభాగం తగ్గించి చూపిస్తున్నారని, ఇది ముమ్మాటికీ అధికారుల తప్పిదమేనని ఆరోపించారు. గత 30 ఏళ్లుగా తగ్గని భూమి ఇప్పుడు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. తాము ప్రైవేటు సర్వే చేయించుకుంటే తమ భూమి ఖచ్చితంగానే ఉందని, అప్పుడు లోపం ఎక్కడుందో తెలపాలన్నారు. ఏ సర్వే నెంబర్లో విస్తీర్ణం తగ్గితే ఆ సర్వే నెంబర్కు మాత్రమే ఇది వర్తింపజేయాలని మిగతా వారికి ఎలా వర్తింప చేస్తారని ప్రశ్నించారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఉన్నత అధికారులకు తమ సమస్యలను విన్నవించుకున్నామని, వారి ఆదేశాల మేరకు విచారణకు వచ్చిన అధికారులు సైతం తూతుమంత్రంగా వచ్చి మమ్మల్ని మభ్యపెట్టేందుకు చూస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. గతంలో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నట్లుగా తమ భూమి తమకు ఉండే విధంగా చేయాలని, లేనిపక్షంలో న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.


