స్ఫూర్తిప్రదాత అంబేడ్కర్
భీమవరం: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ నడుచుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శనివారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఏపీ ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏఎస్పీ వి.భీమా రావు, డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీఓ కె.ప్రవీణ్కుమార్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వీ అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనపై ఎస్హెచ్జీ మహిళలు అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. భీమవరం కలెక్టరేట్లో శనివారం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, డీఆర్డీఏ సంయుక్తంగా నిర్వహించిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నిర్వహించిన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. డీఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: స్థానిక బీవీ రాజు విగ్రహం వద్ద శనివారం ట్రాఫిక్పై అవగాహన, త్రీకే రన్ ర్యాలీని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ప్రారంభించారు. యువతే దేశానికి దిశా నిర్దేశమని, ట్రాఫిక్ ని బంధనలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ కె.రాహుల్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
భీమవరం: పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు ప్రశంసనీయమని, వారి సంక్షేమానికి కృషి చేస్తూ అన్నివిధాలా అండగా ఉంటామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. శనివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జడ్డు బ్రహ్మాజీ కల్యాణ మండపంలో జరిగిన 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డులు పోలీస్ బలగాలకు నిజమైన వెన్నెముకగా నిలుస్తున్నారన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు తావులేదు
జిల్లాలో రానున్న పండుగల నేపథ్యంలో ఎ లాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లే కుండా ముందస్తు భద్రతా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎస్పీ ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసులు, చోరీల రికవరీ తదితర అంశాలపై చర్చించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, డీఎస్పీలు జి.శ్రీవేద, డి.విశ్వనాథ్ పాల్గొన్నారు.
తణుకు అర్బన్: తణుకు రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే తణుకు రోడ్ రన్ కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సైతం టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేయడం విమర్శలకు తావిచ్చింది. తణుకు రోడ్రన్ పేరుతో వెబ్సైట్లో 3కే, 5కే, 10కే విభాగాల్లో రూ.250, రూ.300, రూ.350ల చొప్పున వసూలు చేయడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ముందుగా ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్లో నమోదు చేసుకున్నారు. అయితే శనివారం ఎన్టీఆర్ పార్కులో ఏర్పాటుచేసిన శిబిరంలో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల నుంచి సంస్థ ప్రతినిధులు డబ్బులు తీసుకుని టీషర్ట్ అందజేశారు.స్థానిక ఎమ్మెల్యే స్పాన్సర్గా ఉన్న రోడ్రన్ కార్యక్రమంలో అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణమని మాజీ మంత్రి కారు మూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గతంలో రోడ్ రన్లు నిర్వహించిన సమయంలో ఎప్పుడూ వసూళ్లకు పాల్పడలేదన్నారు. ఒక ఎమ్మెల్యే, జిల్లా అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యే కార్యక్రమాలను సంస్థలు డబ్బులు తీసుకుని నిర్వహిస్తుండడం బాధాకరమని అన్నారు. తమ హయాంలో నిర్వహించిన రన్ కార్యక్రమాల్లో అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పించామన్నారు.
స్ఫూర్తిప్రదాత అంబేడ్కర్


