ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్డీఓ) అధికారిగా సయిద్ అబ్దుల్ అజీజ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విని కలిశారు. గతంలోనూ ఆయన ఏలూరు జిల్లా డీఎస్డీఓగా పనిచేశారు. ఇప్పటి వరకూ డీఎస్డీఓగా పనిచేసిన బి శ్రీనివాసరావు విజయవాడకు బదిలీ అయ్యారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా డీఎస్డీఓగా నియమితులైన అధికారి బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఆయన స్థానంలో అజీజ్ ఇన్చార్జి డీఎస్డీఓగా వ్యవహరించనున్నారు.
పారిశుద్ధ్య సిబ్బంది జీతాల బకాయిలపై వినతి
ఏలూరు టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ చక్రధర్బాబుకు బుధవారం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కే.కృష్ణమాచార్యులు, జిల్లా కార్యదర్శి వి.దత్తాత్రేయ (దత్తు) వినతిపత్రం అందజేశారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ కాంట్రాక్ట్ పనులు చేపట్టిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ శానిటేషన్ వర్కర్లకు జీతాలు చెల్లించలేదనీ, భారీగా బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ప్రస్తుతం ఫస్ట్ అబ్జెక్ట్ ప్రైవేటు లిమిటెడ్, ఫస్ట్ అబ్జెక్ట్ ఏజెన్సీ అని వేర్వేరుగా అగ్రిమెంట్లు చేసుకున్న కాంట్రాక్ట్ సంస్థలు తమ పారిశుద్ధ్య కార్మికులను దారుణంగా మోసం చేశాయని ఆరోపించారు. కార్మికులకు న్యాయం చేయకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. సిబ్బందికి జీతాలు చెల్లించని పక్షంలో వాటిని బ్లాక్ లిస్ట్లో పెడతామని హెల్త్ కమిషనర్ హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ ఏలూరు బ్రాంచ్ అధ్యక్షురాలు పీ.విజయ, సూపర్వైజర్ అజయ్ ఉన్నారు.
బాలికల కుస్తీలో
‘పశ్చిమ’కు మూడో స్థానం
విజయవాడరూరల్: ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఏపీఎస్జీఎఫ్), సమగ్ర శిక్ష(ఎస్ఎస్), ఎన్టీఆర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అశోక్ ఫంక్షన్హాలులో 69వ స్కూల్ గేమ్స్ అండర్–19 అంతర్ జిల్లాల కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. నున్న గ్రామంలో బుధవారం జరిగిన బాలికల కుస్తీ పోటీల్లో పశ్చిమ గోదావరి జట్టు మూడోస్థానంలో నిలిచింది. బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలకు 350 మంది క్రీడాకారులు, కోచ్లు మేనేజర్లు హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు.
ఏలూరు జిల్లా డీఎస్డీఓగా అజీజ్ బాధ్యతలు