
తడిసిన ధాన్యాన్ని కుప్పగా వేసేందుకు వచ్చిన నేతలను అడ్డుకున్న పోలీసులు(ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చంద్రబాబు జిల్లా పర్యటన ఫ్లాప్ షోగా ముగిసింది. కోసేసిన వరి పొలాల పరిశీలన.. పక్క మండలాలు, పక్క నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చిన పాడైన ధాన్యాన్ని పరిశీలించినట్లు హహంగామా చేయడం తప్ప పర్యటన అంతా డ్రామాను తలపించింది. రైతు పోరుబాట పేరుతో తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు 12 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బహిరంగ సభలో మాట్లాడారు. పాదయాత్రకు, బహిరంగసభకు జనాలు పలచన కావడంతో టీడీపీ నేతల పరువు పోయింది. జిల్లాలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి ఆ మేరకు కొనుగోలు నిర్వహిస్తున్నారు. నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం రోజుల వ్యవధిలో జరిగాయి. ఇవేవీ జరగలేదని అభూత కల్పనలతో.. అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళానుకున్న టీడీపీ వ్యూహానికి అన్నదాతలే చెక్పెట్టారు.
చంద్రబాబును పట్టించుకోని రైతులు
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గత వారం రోజుల వ్యవధిలో మూడు రోజులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ నెల 5న ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం నాచుగుంట, పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం నందమూరు, తణుకు నియోజకవర్గం తణుకు మండలంలో చంద్రబాబునాయుడు పర్యటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని, ఇష్టానుసారంగా విమర్శలు గుప్పించారు. ఈ నెల 11న తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలం నుంచి తణుకుకు రైతు పోరుబాట పేరుతో 12 కిలోమీటర్ల పాదయాత్ర, తణుకులో బహిరంగసభ నిర్వహించారు. మొత్తం రెండు పర్యటనలు మూడు రోజుల పాటు సాగినప్పటికీ రైతులు మాత్రం ఎక్కడా చంద్రబాబుకు కనిపించని పరిస్ధితి. ప్రతి చోట నేను చెప్పేది వినండి.. నేను మాట్లాడేదానికి అడ్డం చెప్పవద్దంటూ గదుముతూ.. మరీ ప్రతి ఊరిలోనూ ప్రభుత్వంపై బురద చల్లడమే ఎజెండాగా పెట్టుకుని యాత్ర సాగించారు. అయినా జిల్లాలో మాత్రం స్పందన లేదు. ఈ రబీ సీజన్లో ఏలూరు జిల్లాలో 79,229 ఎకరాల విస్తీర్ణంలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా ఇంతవరకు 1,74,515 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2,50,000 ఎకరాల విస్తీర్ణంలో 6.40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి లక్ష్యం కాగా ఇంతవరకు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అకాల వర్షం వల్ల మూడు, నాలుగు రోజుల పాటు కొనుగోళ్ళకు విఘాతం కలిగినప్పటికీ యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని పదే పదే విమర్శలు గుప్పించారు.
తెలుగు తమ్ముళ్ల పాట్లు
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో పెద్దగా సమస్యలు లేవని జిల్లా పార్టీ ముఖ్యులు రాష్ట్ర కార్యాలయానికి చెప్పినా ఉద్దేశపూర్వకంగానే జిల్లాలో పర్యటన ప్రకటించడంతో స్థానిక నేతలు జనసమీకరణకు పడరాని పాట్లు పడ్డారు. ప్రధానంగా తణుకు ముఖ్య నాయకులు పరిస్ధితి మరీ దారుణం. తడిచిన ధాన్యం అందుబాటులో లేద. చంద్రబాబు పర్యటన 12 కిలోమీటర్ల పరిధిలో ఇరగవరం, గోటేరు, కే.ఇల్లందలపర్రులో ధాన్యం కొనుగోళ్ళు వేగంగా జరిగాయి. పదుల ఎకరాల్లోనే స్వల్పంగా పంట నష్టం వాటిల్లింది. దీంతో తణుకు టీడీపీ ఇన్చార్జ్ ఆరిమిల్లి రాధాకృష్ణ మూడు రోజులు మండలాల్లో తిరిగి రైతులందరినీ చంద్రబాబు కార్యక్రమానికి తీసుకువచ్చేలా మండల నేతలకు ఆదేశాలు ఇచ్చారు. దువ్వ, పాలకొల్లు ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రాక్టర్ను ఏర్పాటు చేసి తడిచిన ధాన్యాన్ని పోగుచేసి ఎవరికీ అనుమానం రాకుండా దానిపైన ఎండుగడ్డి కప్పి చంద్రబాబు పర్యటించే మార్గంలో రోడ్డుపై కుప్పగా పోశారు. దీన్ని పోలీసులు, స్థానిక రైతులు గుర్తించి వారిని ప్రశ్నించి రోడ్డుపై కుప్పగా పోసిన ధాన్యాన్ని మళ్ళీ ట్రాక్టర్లో లోడు చేయించి అక్కడ నుంచి పంపించారు. దీంతో సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పోలీసులపై హడావిడి చేసి 5 నిమిషాలు పాటు హైడ్రామా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రామానాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణలు రైతులు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని హడావిడి చేసి సర్దుకున్నారు.
బహిరంగ సభ వెలవెల
చంద్రబాబు పర్యటన కోసం ముందస్తుగా చేసిన ఏర్పాట్లు ప్లాప్ అవడంతో కోతలు పూర్తయిన పొలాల్లోకి దిగి చంద్రబాబునాయుడు ఫొటో షూట్ చేసుకుని పాదయాత్ర కొనసాగించారు. వేలాది మందితో భారీగా తణుకులో బహిరంగసభను నిర్వహించేలా ప్లాన్ చేశారు. తణుకు, పాలకొల్లు, ఉండి, తాడేపల్లిగూడెం నాలుగు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ను కూడా తరలించారు. అయితే చంద్రబాబు సభకు భారీగా తరలివచ్చిన క్యాడర్, చంద్రబాబు తణుకు చేరుకోకముందే వెళ్ళిపోవడంతో సభ కూడా పూర్తిగా ఫ్లాప్షోగా మిగిలిపోయింది.