● అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న 4309 గుడిసెవాసుల వివరాలను సోమవారం నాటికి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హుల వివరాలను నమోదు చేయాలన్నారు. సేకరించిన జాబితాను గ్రామైక్య సంఘాలకు అందజేసీ, వారు పరిశీలించి తీర్మానం చేసిన అనంతరం ఎంపీడీఓలకు పంపించాలని సూచించారు. తొలి దశలో మంజూరైయిన 5,373 ఇళ్ల నిర్మాణాలను ఆగస్టు 15వరకు పూర్తిస్థాయిలో పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇందిరమ్మ ఇంటి వద్ద ఇంకుడు గుంత, ఆరు మొక్కలు నాటేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ నాగపద్మజ, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.
‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’పై సమీక్ష
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణ అమలు పురోగతి పై కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులతో శనివారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు, కార్యక్రమాల అమలు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, సమన్వయంతో పనిచేసి కార్యాచరణ సమర్థవంతంగా అమలు చేయలని కలెక్టర్ ఆదేశించారు. డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్కు భూమి కేటాయించాలి
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం భూ కేటాయింపులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ డాక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అధికారులు, రైతులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు మె రుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతుందని తెలిపారు. సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సుమ, వర్ధన్నపేట తహసీల్దార్, విజయ్సాగర్, అధికారులు పాల్గొన్నారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం
వరంగల్ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఖిలా వరంగల్ శిల్పాల ప్రాంగణంలో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.


