బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేశ్
హన్మకొండ: యువత అభ్యున్నతికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందని భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కుండే గణేశ్ అన్నారు. గురువారం హనుమకొండ హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్లో నమో జెన్ జీ కాన్క్లేవ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేశ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, యూపీఐ, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య రంగాల్లో విస్తరణ వంటి కార్యక్రమాలు దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పించాయని వివరించారు. విద్యార్థుల సమస్యలపై త్వరలోనే బీజేవైఎం ఉద్యమాలు చేపడుతుందన్నారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్రెడ్డి మాట్లాడుతూ బీజేపీ యువతకు అవకాశాలు కల్పిస్తూ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ పెసరు విజయ్చందర్రెడ్డి, అభినవ్ భాస్కర్, యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరీశ్వర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సంతోష్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు తీగల భరత్ గౌడ్, నాయకులు సండ్ర మధు, రాంబాబు, నిఖిల్ చోప్రా, నిఖిల్ రావు, వెంకట్ పాల్గొన్నారు.


