సంగెం: బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కేజీబీవీల ద్వారా గ్రామీణ బాలికలకు నాణ్యమైన విద్య అందిస్తోందని తెలిపారు. సంగెం కేజీబీవీలో జిల్లాలోని 10 కేజీబీవీల సక్సెజ్ మీట్, ఇంటర్మీడియట్ అడ్మిషన్ మేళా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీబీవీల్లో విద్యార్థినుల సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన ఉచిత విద్య, వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, వైద్యసదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. 10 కేజీబీవీలకు చెందిన 215 మంది విద్యార్థినులు, తల్లిదండ్రులు హాజరుకాగా.. వారిలో 71 మంది విద్యార్థినులు ఇంటర్ అడ్మిషన్ల కోసం నమోదు చేసుకున్నట్లు తెలిపారు. గత విద్యాసంవత్సరం ఇంటర్మీడియట్లో జిల్లా మొదటి స్థానం పొందిన సంగెం కేజీబీవీ విద్యార్థిని లావుడ్య దివ్య, పదో తరగతి జిల్లా టాపర్ సలేంద్ర సహర్షిణిని ఘనంగా సన్మానించారు. కేజీబీవీల్లో మౌలిక వసతులకు సంబంధించిన ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. జీసీడీఓ ఫ్లోరెన్స్, కేజీబీవీల ప్రత్యేకాధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు


