కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి నియమాకంలో యూనివర్సిటీ అధికారులు జాప్యం చేస్తున్నారు. ఆవిభాగాధిపతిగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంకినేని వెంకటయ్య రెండేళ్ల పదవీకాలం గత నెల 26న ముగిసింది. రొటేషన్ పద్ధతిలో ఆవిభాగంలో మరో సీనియర్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ను విభాగాధిపతిగా నియమించాల్సి ఉంది. అయితే ఆవిభాగంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం కృష్ణయ్య తాను సీనియర్ అని, మరో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లలిత కుమారి తానే సీనియర్ను అని పొలిటికల్ సైన్స్ విభాగాధిపతిగా తననే నియమించాలని ఇద్దరూ వేర్వేరుగా ఇటీవల యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఎవరు సీనియర్ అనేది వివాదాస్పదమైంది. ఆ విభాగంలో రెగ్యులర్ అధ్యాపకులు ఎవరూ లేరు. దీంతో రెండేళ్ల క్రితం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంకినేని వెంకటయ్యను విభాగాధిపతిగా నియమించగా రెండేళ్ల పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో మరొకరిని నియమించాల్సి ఉంది.
ఎవరు సీనియరో.. తేల్చేందుకు కమిటీ
కాకతీయ యూనివర్సిటీలోని పొలిటికల్ సైన్స్ విభాగంలో విభాగాధిపతి నియామకం కోసం ఆ ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఎవరు సీనియర్ అనేది తేల్చేందుకు వీసీ ప్రతాప్రెడ్డి ఆదేశాల మేరకు ఇటీవల కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం కమిటీని నియమించారు. కమిటీ చైర్మన్గా సోషల్ సైన్స్ డీన్ ఎకనామిక్స్ విభాగాధిపతి ఆచార్య బి.సురేశ్లాల్, సభ్యుడిగా యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ను, మెంబర్ కన్వీనర్గా సీడీసీ డీన్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రణయ్కుమార్ను నియమించారు. కమిటీ పొలిటికల్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఎవరు సీనియర్ అనేది తేల్చాల్సి ఉంటుంది. పరిపాలనా భవనంలో టీచింగ్ విభాగంలో ఆయా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి సర్వీస్ వివరాలు ఎప్పుడు నియామకం అయ్యారనే వివరాలుంటాయి. ఆయా రికార్డులను పరిశీలించనున్నారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం విభాగాధిపతిని నియమించనున్నారు. మరొకరిని నియమించే వరకు సంకినేని వెంకటయ్య బాధ్యతల్లో కొనసాగుతారని సంబంధిత అధికారులు తెలిపారు.
పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ఎవరు?
ఇద్దరు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లలో ఒకరికి అవకాశం


