ఎల్కతుర్తి : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మండలంలోని గోపాల్పూర్లో నిర్వహించిన ప్రత్యేక వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి అప్పయ్య, సర్పంచ్ కర్రె లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఈ వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 283 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పీహెచ్సీ డాక్టర్ విజేందర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
● ప్రమాదంలో డ్రైవర్ మృతి
దామెర : రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతిచెందిన సంఘటన దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం..యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లపల్లి కి చెందిన అవిశెట్టి శ్రీశైలం (26) ఇసుక కోసం మంగళవారం తెల్లవారుజామున లారీతో ఏటూరునాగారం వెళ్తున్నాడు. ఈ క్రమంలో దామెర మండలంలోని ఒగ్లాపూర్ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో టిప్పర్ వెనుక భాగాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ శ్రీశైలం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 వాహనంలో చికిత్స ని మిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చి కిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి మామ బాతుక జంగయ్య ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ వన్నాల రామకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
కమలాపూర్ : నిత్యం అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 108, 102 జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ సూచించారు. కమలాపూర్ ప్రభుత్వాస్పతి ఆవరణలో ఉన్న 108, 102 అంబులెన్సులను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్సుల్లో ఉన్న రికార్డులు పరిశీలించి మండల ప్రజలకు అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవికాలం దృష్ట్యా వడదెబ్బ, డయేరియా వంటి కేసులు వచ్చే అవకాశాలు ఉన్నందున అంబులెన్సుల్లో ఐస్ ప్యాక్లు, ఓఆర్ఎస్ ద్రావణం అందుబాటులో ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ వరికోలు శ్రీనివాస్, పైలెట్ బండారి కుమారస్వామి, 102 కెప్టెన్ పవన్ తదితరులు పాల్గొన్నారు.


