రామన్నపేట : కమిషనరేట్ పరిధిలో ఇసుక రవాణాతో పాటు, గుట్కా విక్రయాలు, రేషన్ బియ్యం, పేకాటను కట్టడి చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ ద్వారా నియంత్రించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అధికారులకు సూచించారు. కమిషనరేట్ పోలీసు అధికారుల నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం కాకతీయ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్లు, అధికారులు, సిబ్బంది పనితీరుపై సీపీ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్ప్రీత్ సింగ్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తూ కమిషనరేట్ పరిధిలో పేకాట రాయుళ్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని, స్టేషన్ అధికారులు తమ పరిధిలో ఏర్పాటు చేసిన కెమెరాలను ఎప్పటికప్పుడు జియో ట్యాగింగ్కు అనుసంధానం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. హనుమాన్ జయంతి వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీసీపీలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, దార కవిత, జనగామ ఏఎస్పీ చేతన్, ట్రెయినీ ఐపీఎస్ మనీషా నెహ్ర, అదనపు డీసీపీలు ప్రభాకర్, రవి, బాలస్వామి, శ్రీనివాస్తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.


