వర్ధన్నపేట: వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య అన్నారు. సోమవారం వర్ధన్నపేట పోలీస్స్టేషన్ ఆవరణలో డ్రైవర్లకు నిర్వహించిన నేత్ర పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డ్రైవర్లు ప్రతీ మూడు నెలలకోసారి కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. రోడ్డు నిబంధనలు ప్రతిఒక్కరూ పాటిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందన్నారు. పరిమితికి మించిన లోడుతో వెళ్లడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అందరు సహకరించి రోడ్డు నిబంధనలు పాటించాలని, లేదంటే చట్టరీత్య చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు సాయిబాబు, రాజు, రామారావు, రాజేందర్, పోలీస్ సిబ్బంది, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.


