● మరో విద్యార్థికి గాయాలు
గీసుకొండ: ఓ పదో తరగతి విద్యార్థి తమాషాకు ఆటో నడిపేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో నడిపిన విద్యార్థి మృతిచెందడంతోపాటు మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంటకు చెందిన ల్యాదళ్ల అక్షయ్(15), ల్యాదళ్ల శశాంత్కుమార్ విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాస్తున్నారు. ఇప్పటికే మూడు సబ్జెక్టులు రాయగా, మరో నాలుగు రాయాల్సి ఉంది. ఈ నెల 25న ఉదయం 7 గంటల సమయంలో శశాంత్కుమార్ తన తండ్రి ఆటోను తీసుకుని తాగునీటి కోసం వెళ్తుండగా వెంట అక్షయ్ కూడా వెళ్లాడు. ఊరి చివరన వెళ్లాక తాను నడుపుతానని శశాంత్కుమార్ నుంచి అక్షయ్ ఆటోను తీసుకున్నాడు. గేర్లు వేసి అజాగ్రత్తగా ఒకవైపు తిప్పగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అక్షయ్ తలకు, శరీర భాగాలకు బలమైన గాయాలయ్యాయి. శశాంత్కుమార్కు కాలు విరిగింది. బంధువులు ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించగా అక్షయ్ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి పది గంటలకు మృతిచెందాడు. మృతుడి తండ్రి ప్రవీణ్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు.


