● ఇన్చార్జ్ డీఆర్డీఓ గూడూరు రాంరెడ్డి
దుగ్గొండి: విధి నిర్వహణలో తప్పులు మరోసారి జరగకుండా చూసుకోవాలని జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ బహిరంగ ప్రజావేదిక గురువారం జరిగింది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు గ్రామాల్లో రూ.8 కోట్ల 49 లక్షల 46 వేల విలువైన ఉపాధి హామీ పనులు చేపట్టారు. రూ. 5 కోట్ల 85 లక్షల 7వేలు కూలీలకు చెల్లించగా రూ.2 కోట్ల 64 లక్షల 39 వేల విలువగల మెటీరియల్ పనులు జరిగాయి. సామాజిక కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి ఉపాధి హామీ పనుల్లో అవినీతి, అక్రమాలను వెలికితీసి సభ ముందు ఉంచారు. ఈ సందర్భంగా డీఆర్డీఓ మాట్లాడారు. పనుల్లో పారదర్శకత పాటించాలని, శాశ్వత అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఆడిట్లో తేలిన అవినీతి రూ. 42,200
ఉపాధి హామీ 17వ సామాజిక తనిఖీలో భాగంగా వివిధ గ్రామాల్లో రూ. 42,200 అవినీతి జరిగినట్లు లెక్కతేల్చారు. ఆ డబ్బులకు బాధ్యులైన పంచాయతీ కార్యదర్శుల నుంచి రూ.15,667, ఫీల్డు అసిస్టెంట్ల నుంచి రూ.15,876, టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి రూ.4,759, మేట్ల నుంచి రూ.5,898 రికవరీ చేస్తామని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ అధికారి అలివేలు, అదనపు డీఆర్డీఓ శ్రీవాణి, ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఎస్సార్పీ కవిత, ఏపీఓ శ్రీనివాస్, ఈసీ రాజు, స్పెషల్ టీఏలు సుధాకర్, సురేశ్, డీఆర్పీలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.


