రాయపర్తి: మండల కేంద్రంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన ఎదుర్కోళ్ల కార్యక్రమంలో టీటీడీ వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ రాంరెడ్డి కృష్ణమూర్తి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
రామయ్యకు
పసిడి పాదుకలు
నర్సంపేట: శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని నర్సంపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు, జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామోజు జయకుమార్ పసిడి పాదుకలను తయారుచేశారు. రాముడిపై ఉన్న తన భక్తిని చాటుతూ 8 మిల్లీమీటర్ల వెడల్పు, 7 మిల్లీమీటర్ల ఎత్తులో 40 మిల్లీగ్రాముల బంగారంతో సూక్ష్మ పాదుకలను తయారు చేశారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో ప్రపంచం అల్లకల్లోలంగా మారుతోందని, అందుకే ప్రపంచ శాంతి నెలకొనాలని సీతారాములను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దేశం ఎదుర్కొనే ఆటంకాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు.
దళిత యువతకు పథకాలు
న్యూశాయంపేట: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత యువతకు ఫేజ్–2 ప్రణాళికలో భాగంగా పలు నూతన పథకాలు అమలు చేయనున్నట్లు జిల్లా కార్యనిర్వాహక సంచాలకులు సురేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఈవీలు, స్కూటర్లు, ఆటోరిక్షాలు, సోలార్పంపు యూనిట్లు, వ్యవసాయ సంబంధిత డ్రోన్స్, సెరికల్చర్ తదితర పథకాల కోసం ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులు సరైన ధ్రువపత్రాలతో టీజీఓబీఎంఎంఎస్న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో వచ్చేనెల 2వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


