హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో నిర్వహిస్తున్న సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి ఉత్సవాలు బుధవారం ఏడో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతారాములకు లక్షతులసి అర్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు విశ్వక్సేనారాధన, పాంచరాత్ర ఆగమానుసారంగా పంచసూక్తములతో చతుర్వేద మూలమంత్రంగా అర్చనలు జరిపారు. కమ్మ సంఘం రాష్ట్ర నాయకుడు చిన్న కోనయ్య–ధనలక్ష్మి దంపతుల సౌజన్యంతో తూర్పుగోదావరి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన తులసి దళాలతో సీతారాముల ఉత్సవ విగ్రహాలకు లక్షతులసి అర్చన చేశారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు.
హన్మకొండ : ప్రయాణికుల సలహాలు, సూచనల మేరకు మెరుగైన సేవలు అందించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–2 డిపో మేనేజర్ ఎం.రవిచందర్ తెలిపారు. ఈ నెల 26న(గురువారం) మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు హనుమకొండలోని వరంగల్–2 డిపో నుంచి డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ములుగు, ఏటూరునాగారం ప్రాంత ప్రయాణికులు 99595 58556 నంబర్కు ఫోన్ చేసి సలహాలు ఇవ్వాలని కోరారు.


