కాళోజీ సెంటర్: కేజీబీవీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రంగయ్యనాయుడు, కేజీబీవీల కోఆర్డినేటర్ కొల్లూరి ఫ్లోరిన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హతగల బాలికలు http://tgrjc.cgg.gov.in లో ఏప్రిల్ 15లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఖానాపురం, వర్ధన్నపేట, గీసుకొండలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఐఓఈ) కళాశాలలు ఉన్నాయని వారు తెలిపారు.
ఆశవర్కర్లకు
అండగా ఉంటాం..
న్యూశాయంపేట: ఆశవర్కర్లకు అండగా ఉంటామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జి.యువరాజు, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె.లలిత ఆధ్వర్యంలో ఏకశిల పార్కు నుంచి భారీ ప్రదర్శనగా వచ్చి మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు సుదర్శన్రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశ వర్కర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనమన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు బి.మంజుల, ఎన్.రవి, పి.రమేశ్, మహేశ్వరి, సంధ్య, లత, అనిత, సాలమ్మ, వసుమతి, మంజుల, సునీత, జ్యోతి, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనాలు
ఎంపిక చేసుకోవాలి
ఖిలా వరంగల్: పంటల సాగులో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల, శాస్త్రవేత్తలు శ్రావణ్, మధు, కేవీకే శాస్త్రవేత్త సౌమ్య సూచించారు. ఈమేరకు మంగళవారం వరంగల్ రైతుశిక్షణ కేంద్రంలో రైతులు–శాస్త్రవేత్తల చర్చా గోష్టి నిర్వహించారు. వరంగల్, ఖిలా వరంగల్, గీసుకొండ, సంగెం, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల రైతులు హాజరై పంటల సాగులో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు, సాంకేతిక సలహాలు పొందారు. ముఖ్యఅతిథిగా వారు హాజరై పంటలసాగు, విత్తనాల ఎంపిక, పురుగులు, తెగుళ్ల నియంత్రణ, సమగ్రపంటల సంరక్షణ విధానాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా జీవనియంత్రణ పద్ధతులు, సమగ్ర పురుగు మందుల నిర్వహణ, మట్టి పరీక్షల ప్రాముఖ్యత, అధిక దిగుబడులు సాధించే ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై ప్రదర్శనలు, చర్చ నిర్వహించారు. వర్ధన్నపేట ఏడీఏ నర్సింగం, బయోకంట్రోల్ ల్యాబ్ ఏడీఏ మాధవి, వరంగల్ మండల వ్యవసాయాధికారి రవీందర్రెడ్డి, ఏఈఓ ఆశాదీప్, రైతులు పాల్గొన్నారు.
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారికి కనకాంబరాలతో పుష్పార్చన నిర్వహించారు. ఉదయం అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అర్చకులు, శ్రీభద్రకాళి సాంగ ఆగమ వేద పాఠశాల విద్యార్థులు కనకాంబరాలకు సంప్రోక్షణ జరిపి అమ్మవారికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు పాలకుర్తి శ్రీనివాస్గౌడ్, కృష్ణవేణి ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవాలయ ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.
జానకీరాముడిగా అలంకరణ
వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న సీతారామచంద్రస్వామి కల్యాణ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం సీతారాములకు లక్ష పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు జరిపి రాముల వారి ఉత్సవ విగ్రహాన్ని జానకీ రాముడిగా అలంకరించారు. అనంతరం 11 మంది వేద పండితులు పాల్గొని లక్ష శ్రీరామ నామాలు పఠించారు.


