హన్మకొండ అర్బన్: డౌన్ సిండ్రోమ్ అనేది లోపం కాదు.. అది ప్రత్యేక పరిస్థితి మాత్రమే అని సీపీ సన్ప్రీత్ సింగ్ అన్నారు. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు ప్రేమ, సహనం, సరైన శిక్షణ అందిస్తే సమాజంలో ఉన్నత స్థానం సంపాదించగలరని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నగరంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వీరిపై సానుభూతి, గౌరవంతో వ్యవహరించాలని సూచించారు. డౌన్ సిండ్రోమ్ పిల్లలపై సమాజంలో సానుకూల ధృక్పథం పెంపొందించడం, వారికి సమాన అవకాశాలు కల్పించడం బాధ్యతగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకురాలు బండ రామలీల, కొడం కళ్యాణ్, ప్రొఫెసర్ పద్మ, డౌన్ సిండ్రోమ్ పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బీఎడ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
లోక్ అదాలత్ను వినియోగించుకోవాలి
వరంగల్ క్రైం: ఈనెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వి నియోగం చేసుకోవాలని, రాజీపడే కేసులను పరిష్కరించుకోవాలని సీపీ సన్ప్రీత్ సింగ్ సూచించారు. లోక్ అదాలత్లో క్రిమినల్, సివిల్, ఆస్తి, కుటుంబపరమైన, వైవాహిక, బ్యాంకు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, తదితర కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజీపడే మార్గముంటే కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు.


