హన్మకొండ కల్చరల్: ఆదర్శ జీవితానికి శ్రీరాముడు స్ఫూర్తి అయితే, సత్పరిపాలనకు రామరాజ్యం దిక్సూచి అని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ పేర్కొన్నారు. వేయిస్తంభాల గుడిలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఆదివారం ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ప్రభాతసేవ, గణపతి పూజ, రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు పంచరాత్ర శాస్త్ర ఆగమంతో అర్చకులు సూక్తవిధానంతో విశ్వక్సేనారాధన, విష్ణుసూక్తంతో నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం రాములవారి ఉత్సవ విగ్రహాన్ని బాలరాముడిగా అలంకరించి ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వైద్యులు రాహుల్–అక్షిత దాతలుగా వ్యవహరించారు. నిజామాబాద్కు చెందిన హనుమాన్ మాలధారులు పాల్గొన్నారు. అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, నరసింహాచార్యులు, శ్రీవాత్సవ్, సిబ్బంది మధుకర్, రజిత పాల్గొని సేవలందించారు. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు.
వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ సిద్ధమైంది. అకౌంటింగ్ విభాగం అధికారులు, ఉద్యోగులు సిద్ధం చేసి మేయర్ గుండు సుధారాణికి, హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి అందజేశారు. ఈనెల 25న బడ్జెట్ ఆమోదం కోసం గ్రేటర్ వరంగల్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. పాలకవర్గం పదవీ కాలం మరో నెలన్నర రోజుల్లో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ పాలక వర్గానికి చివరి బడ్జెట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.


