
చెరువులను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలి
హసన్పర్తి: వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతీ చెరువు, కుంటలను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం హనుమకొండ ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన చెరువులు, కుంటలు, కెనాల్ భూములు కబ్జా చేసిన అడ్డంకులు సృష్టించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ రైతులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వడ్లకొండ చెరువు కట్టను బలోపేతం చేయడమేకాకుండా కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
భూములను ఆక్రమిస్తే చర్యలు
పర్వతగిరి: చెరువుకు సంబంధించిన భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం మండలంలోని అన్నారం పెద్ద చెరువు తూము వెనుక భాగంలో ఉన్న పంట పొలాలను క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి తూమును వెంటనే రిపేరు చేయించి చెరువుకు సంబంధించిన భూములను ఎవరైన ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్.దిలీప్రాజ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ఆర్చరీ
క్రీడా పోటీలకు ఎంపిక
పర్వతగిరి: మండలంలోని కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ ఆర్చరీ అకాడమీలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఐలయ్య, ఆర్డీఎఫ్ ప్రిన్సిపాల్ ఎ.జనార్దన్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వారు మాట్లాడుతూ 80 మంది క్రీడాకారులు పాల్గొనగా అండర్ 19 విభాగంలో పి.వినయ్ 1వ ర్యాంకు, ఎం.అజయ్ 3వ ర్యాంకు, బి.కరుణాకర్ 4వ ర్యాంకు, బాలికల విభాగంలో టింకీ 1వ ర్యాంకులో నిలిచారు. అండర్–17 బాలుర విభాగంలో బి.వినయ్ 1వ, అశ్విత్ 2వ, అవినాష్ 3వ, రామ్చరణ్ 4వ ర్యాంకు, బాలికల విభాగంలో బి.మానస 1వ ర్యాంకు, పి.ఉషారాణి 2వ ర్యాంకుతో ప్రతిభ కనబర్చారు. అండర్–14 బాలుర విభాగంలో బి.సిద్దు 4వ ర్యాంకు, బాలికల విభాగంలో సహస్ర 1వ ర్యాంకు సాధించారు. విద్యార్థుల ప్రతిభను తీర్చిదిద్దడంలో అర్చరీ కోచ్ బండారి భరత్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులను అభినందిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని కోరారు.
నాన్ మెడికల్ అధికారులను నియమించొద్దు
నర్సంపేట: ప్రభుత్వ ఆస్పత్రుల పరిపాలన కోసం నాన్ మెడికల్ అధికారుల నియామకం చేయడం వైద్య రంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు. ఈ మేరకు పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆస్పత్రుల పరిపాలన బాధ్యతలను నాన్ మెడికల్ అధికారులకు అప్పగించాలని చేసిన ప్రతిపాదనలపై వైద్య వర్గాల్లో తీవ్రమైన అసహనం నెలకొందన్నారు. ఈ నిర్ణయం ఆరోగ్య వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్దమని, రోగి సేవల నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నాన్ మెడికల్ అధికారులకు అప్పగించే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేదంటే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో వైద్య వర్గాలను, రోగులను, ప్రజాస్వామ్య వర్గాలను సమీకరించి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

చెరువులను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలి

చెరువులను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలి