
సమాచారహక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
న్యూశాయంపేట: సమాచార హక్కు చట్టంపైన పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాల్లో అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. ఈనెల 5 నుంచి 12వ తేదీ వరకు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు నిర్వహించనున్నట్లు వివరించారు. అధికారులు సమాచార హక్కు చట్టంపై జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
కలెక్టర్ను కలిసిన శిక్షణ డిప్యూటీ కలెక్టర్
గ్రూప్–1 ద్వారా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికై న నక్క శ్రుతిహర్షిత శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రుతిహర్షిత జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా శిక్షణ పొందనున్నారు.
ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ
వరంగల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బంది, వీఓల అధ్యక్షురాళ్లకు డీఆర్డీఏ సమావేశ మందిరంలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి హాజరై పలు అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తయిన ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తే వర్షాలు వచ్చినా ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసిన వెంటనే రైతు పేరు సీరియల్ బుక్లో రిజిస్టర్ చేసి, నంబర్ ఇచ్చి తూకం వేయాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కనీస మద్దతు ధర గ్రేడ్–ఏ రకానికి రూ.2,389, కామన్ గ్రేడ్కు రూ.2,369, సన్నధాన్యానికి అదనంగా బోనస్ రూ.500 చెల్లించనున్నట్లు తెలిపారు. అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు రజిత, కార్యదర్శి ఉమాదేవి, కోశాధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీఐతో సుపరిపాలన
రామన్నపేట/కాళోజీ సెంటర్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) డాక్టర్ శ్రీధర్ సుమన్ అన్నారు. రాష్ట్ర సమాచార కమిషన్, కలెక్టర్ ఆదేశాల మేరకు ‘ఆర్టీఐ ద్వారా సుపరిపాలన’ అంశంపై జిల్లాలోని పలు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఏవీవీ జూనియర్ కళాశాలలో పోటీలను ఆయన పరిశీలించి మాట్లాడారు. సమాచార హక్కు చట్టం–2005 ప్రజలకు వజ్రాయుధంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్, కార్యక్రమ నిర్వాహకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాసరావు, అధ్యాపకులు అనిత, శ్రీధర్, శ్రీనివాస్, సంజీవ, గోపి పాల్గొన్నారు.
లేఅవుట్లకు అనుమతి
న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని లేఅవుట్ల అనుమతుల కోసం కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో లేఔట్ కమిటీ సమావేశం జరిగింది. జీడబ్ల్యూఎంసీ పరిధిలో ఒక లేఅవుట్, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు అనుమతుల కోసం ప్రతి పాదనలను కమిటీ పరిశీలించి అనుమతి మంజూరు చేసింది. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీటీసీపీ జ్యోతి, కుడా పీఓ అజిత్రెడ్డి, సిటీప్లానర్ రవీందర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఇజ్జగిరి, రోడ్లు, భవనాల అధికారి రాజేందర్, జిల్లా ఇరిగేషన్ అధికారి కిరణ్కుమార్, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం డిప్యుటేషన్పై ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి సెల్ ఏర్పాటుకు అర్హత, ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు, హెచ్ఎంల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్, సర్వశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ డీఈఓ, ఆర్జేడీలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 24 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

సమాచారహక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

సమాచారహక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి