
రేపు వరంగల్లో పల్స్పోలియో
● డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు
గీసుకొండ: వరంగల్ నగరలో 0–5 ఏళ్లలోపు ఉన్న 20,121 మంది పిల్లలకు ఈ నెల 12న పోలియో చుక్కలు వేయనున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ బి.సాంబశివరావు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సబ్ నేషనల్ పోలియో వ్యాక్సినేషన్పై శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేవలం వరంగల్ నగర ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ప్రజలు తమ పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకుని వెళ్లి చుక్కల మందు వేయించాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ నగరంలోని సీకేఎం, ఎంజీఎం, చింతల్, దేశాయిపేట, ఫోర్టు వరంగల్, కీర్తినగర్, రంగశాయిపేట, ఎస్ఆర్ఆర్తోట, కాశి బుగ్గలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో చుక్కల మందు వేసే కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. అదేవిధంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, ట్రాన్సిస్ట్ పాయింట్లు, మరో ఏడు మొబైల్ టీంలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని, ట్రాన్సిస్ట్ సెంటర్లలో 24 గంటలపాటు చుక్కల మందు వేస్తారని చెప్పారు. సంబంధిత శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ కోరారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.