
అందని వేతనాలు
నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 40మంది శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఐదు నెలలుగా వేతనాలు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 250 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయినా ఆ సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. పని భారం పెంచుతూ వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలగా అప్గ్రేడ్
2000వ సంవత్సరంలో 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు నూతన భవనాన్ని నిర్మించారు. రోజురోజుకు రోగుల తాకిడికి ఎక్కువ కావడంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 70 పడకల ఆస్పత్రిగా, ఆ తర్వాత వంద పడకల ఆస్పత్రిగా, అనంతరం 250 పడకల ఆస్పత్రిగా, జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలగా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రిని అప్గ్రేడ్ చేస్తూ వచ్చారు. అయితే, అవసరమైన సిబ్బందిని మాత్రం నియమించలేదు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో 40మంది శానిటేషన్ సిబ్బందిని నియమించారు. అప్పటి నుంచి అంత మందినే అధికారులు కొనసాగిస్తూ వస్తున్నారు. జిల్లా ఆస్పత్రి, మెడికల్ కళాశాలగా అప్గ్రేడ్ అయినా కూడా సిబ్బంది సంఖ్య మాత్రం పెరగలేదు. ఆ 40మందిలో 18మంది స్వీపర్లు, 8మంది సెక్యూరిటీ గార్డులు, 10మంది పేషెంట్ కేర్, నలుగురు సూపర్వైజర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వారికి టీవీవీపీ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) ద్వారా గత అక్టోబర్ వరకు రెన్యువల్ శ్రీసాయి కోస్టల్ ఏజెన్సీ ద్వారా వేతనాలు చెల్లించారు. గత మార్చి వరకు టీవీవీపీ ఆధ్వర్యంలో, ఆ తర్వాత డీఎంఈ (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)కు పూర్తిస్థాయిలో అప్పగించారు. అప్పటి నుంచి వారికి డీఎంఈ నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు. మిగతా నెలల జీతం ప్రభుత్వం నుంచి రాగానే ఇస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అక్టోబర్ నెలతో శానిటేషన్ కార్మికుల రెన్యూవల్ పూర్తి కావోస్తోంది. డీఎంఈ ఆధ్వర్యంలో అధికారులు క్రమబద్ధీకరించాల్సి ఉంది. జీతాలే సరిగా ఇవ్వడం లేదని, రెన్యూవల్ ప్రక్రియను ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దసరా పండుగలోపైనా జీతాలు చెల్లించాలని సిబ్బంది వేడుకుంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే జీతాలు అందించి, రెన్యువల్ చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం..
శానిటేషన్ సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలు ఏప్రిల్ నుంచి పెండింగ్లో ఉన్నాయని, వారికి వెంటనే అందించాలని ప్రభుత్వానికి నివేదించాం. బడ్జెట్ రాగానే వారికి వేతనాలు అందిస్తాం. కార్మికుల సమస్యలపై మరోసారి డీఎంఈ అధికారులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్తో మాట్లాడించి త్వరగా బిల్లులు వచ్చేలా కృషి చేస్తాం.
– కిషన్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి
సూపరింటెండెంట్, నర్సంపేట
ఐదు నెలలుగా ఇబ్బందుల్లో శానిటేషన్ సిబ్బంది
250 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ అయినా 40 మందితోనే నెట్టుకొస్తున్న నిర్వాహకులు
పట్టించుకోని నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఉన్నతాధికారులు

అందని వేతనాలు

అందని వేతనాలు

అందని వేతనాలు