
23న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి
ములుగు: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధికి ఈ నెల 23 (మంగళవారం)న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నట్లు తెలిసింది. మేడారం అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. అభివృద్ధిపై సమీక్ష అనంతరం డిజైన్లను సీఎం రేవంత్రెడ్డి ఖరారు చేస్తారని సమాచారం. శనివారం మేడారం అభివృద్ధి ప్రణాళికపై ఐసీసీసీలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.
అధికారులు నిబద్ధతతో పనిచేయాలి
న్యూశాయంపేట: గ్రామపాలన అధికారులు నిబద్ధతతో పనిచేయాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. ఇటీవల నియమితులైన గ్రామపాలన అధికారులకు జిల్లా పరిషత్ సమావేశ హాల్లో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల కర్తవ్యాలు, విధులు, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలతో సమన్వయం, పారదర్శక పాలనపై దిశానిర్దేశనం చేశారు. అధికారులు నైతిక బాధ్యతతో పనిచేయాలని, సమగ్ర గ్రామాభివృద్ధి దిశగా నిరంతరం కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు ఇక్బాల్, వెంకటస్వామి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థి దశనుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలి
నర్సంపేట: విద్యార్థి దశనుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని జెడ్పీ సీఈఓ రాంరెడ్డి సూచించారు. ప్రతిభ, ఆసక్తి, సామర్థ్యాలకు తగ్గట్లుగా సరైన కెరీర్ ఎంచుకోవాలన్నారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై స్ఫూర్తి అవగాహన కార్యక్రమం, తల్లిదండ్రుల సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం తేజావత్ జయ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఇతర రంగాల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్.సునీత, కె.సంతోష్కుమార్, పిన్నింటి బాలాజీరావు, తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆద్వర్యంలో రేవంతన్నా సహారా మిస్కినో కే లియే పథకానికి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్, హనుమకొండ జిల్లాల మైనారిటీల సంక్షేమాధికారులు టి.రమేశ్, గౌస్హైదర్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద వితంతువులు, విడాకులు పొందిన, అనాథ మహిళలకు రూ.50వేల ఆర్థిక సాయంతోపాటు చిన్న వ్యాపారాలకు ప్రోత్సాహకం అందిస్తారని పేర్కొన్నారు. రేవంతన్నా సహారా మిస్కినో కే లియే సహారా పథకం కింద మైనారిటీ లబ్ధిదారులకు మోపెడ్లు, ఈ–బైక్లు, ఒకేసారి లక్ష రూపాయల గ్రాంట్ మంజూరు చేస్తారని తెలిపారు. అర్హులు టీబీఎంఎంఎస్న్యూ.సీజీజీ.జీఓవీ.ఇన్ ద్వారా వచ్చేనెల ఆరో తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని, వివరాలకు ఆయా జిల్లాల మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.
వరంగల్ స్పోర్ట్స్: మలేషియాలోని యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహించిన అంతర్జాతీయ క్రీడా సదస్సులో హనుమకొండ డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ ప్రత్యేకత చాటుకున్నారు. చివరి రోజు శనివారం ‘కుస్తీ క్రీడలో ఠాకూర్దేవ్సింగ్ అవసరం’ అనే అంశంపై అశోక్కుమార్ పేపర్ ప్రజంటేషన్ అందించారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని తండాకు చెందిన అశోక్ రెజ్లింగ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రజంటేషన్ చేయడంపై పలువురు ప్రశంసించారు. ప్రస్తుతం అశోక్కుమార్ ఎన్ఐటీ ప్రొఫెసర్ పి.రవికుమార్ పర్యవేక్షణలో పీహెచ్డీ చేస్తున్నారు.
నర్సంపేట: చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో ప్రధాన రహదారి పక్కన బస్టాండ్ ప్రతిపాదిత స్థలాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం విజయభాను శనివారం పరిశీలించారు. త్వరలో బస్టాండ్ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సిద్దన రమేష్, మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

23న మేడారానికి సీఎం రేవంత్రెడ్డి