
పక్కాగా పంటల లెక్క
క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న ఏఈఓలు
వివరాలు నమోదు చేయకుంటే ఇబ్బందులు..
హన్మకొండ: వానా కాలం పంటల సాగు లెక్కలు కచ్చితంగా తేల్చేందుకు ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేను చేపట్టింది. వ్వవసాయ విస్తరణాధికారులు మొబైల్ ఫోన్లోని ప్రత్యేక యాప్లో డిజిటల్ క్రాప్ సర్వే చేస్తున్నారు. సాగు చేసిన పంటల ఫొటోలు కూడా యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇంతకు ముందు అంచనాల ఆధారంగా పంటలు నమోదు చేసే వారు. అయితే, కచ్చితత్వం కోసం పంటలను భౌతికంగా చూడడం ద్వారా పంటల సాగు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తద్వారా ప్రభుత్వం మార్కెటింగ్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు, ఇతరత్రా ఏర్పాట్లు, నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
జిల్లాలో 14 మండలాల్లోని 125 గ్రామాల్లో 55 క్లస్టర్లున్నాయి. 55 మంది వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ)లు సర్వేలో మునిగిపోయారు. జిల్లాలో 2,21,163 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. వరి 1,38,803 ఎకరాలు, పత్తి 74,849 ఎకరాలు, మొక్కజొన్న 7080, పప్పు దినుసులు 395, నూనె గింజల పంటలు 32 ఎకరాలతో పాటు ఇతర పంటలు సాగు చేశారు. పురుష ఏఈఓలు 2 వేల ఎకరాల్లో, మహిళా ఏఈఓలు 1800 ఎకరాల్లో డిజి టల్ క్రాప్ సర్వే చేస్తారు. ఈ మేరకు సర్వే నంబర్ల వారీగా ఏఈఓలకు పంటల సర్వే విస్తీర్ణాన్ని కేటా యించారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో పంట బుకింగ్ పూర్తి చేయడానికి వీలుగా ఈ యాప్ ఆఫ్లైన్ ఫీచర్తో రూపొందించారు.
వరి సాగు ఏ పద్దతిలో చేశారో కూడా నమోదు చేసేలా యాప్ను రూపొందించారు. అదే విధంగా విత్తనోత్పత్తి పంటల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. వరి పంట సాగును సన్న, ముతక రకాల వారీగా నమోదు చేయాలని సూచించారు. పంట విత్తిన వివరాలు నమోదు ద్వారా ఆ పంట ఎప్పుడు కోతకు వస్తుందో అంచనా వేయడం ద్వారా పంట కొనుగోలు/సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళిక రూపొందించుకునే అవకాశముంటుంది. ఉద్యాన సాగులో అంతర్ పంటలను కూడా సర్వేలో నమోదు చేస్తారు. రైతుపేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ల్యాండ్ మార్క్, క్షేత్రంపేరు, సాగు చేసిన పంటల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పంట బుకింగ్ 90 శాతం బుకింగ్ చేయగానే రైతు మొబైల్కు ఆరు సందేశాలు వెళ్తాయి. పంటల సాగులో తేడాలుంటే ఏఈఓను కలిసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి.
అక్టోబర్ 25 వరకు పూర్తిచేయాలి..
జిల్లాలో అక్టోబర్ 25 వరకు పంటల బుకింగ్ పూర్తి చేయాలి. అదే నెల 27న గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డిజికల్ క్రాప్ సర్వే వివరాలు ప్రదర్శిస్తారు. నవంబర్ 1న రైతుల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారు. ఇదేనెల 3న అభ్యర్థనలను క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలిస్తారు. నవంబర్ 5న తుది డిజిటల్ క్రాప్ సర్వేను ప్రదర్శిస్తారు.
రైతులు స్వచ్చందంగా పంట లు నమోదు చేయించుకోవా లి. అక్టోబర్ 25లోపు డిజిటల్ క్రాప్ సర్వేలో పంటల సాగు వివరాలు నమోదు చేసుకోవాలి. ఏఈఓలు క్షేత్ర స్థాయికి చేరుకుని డిజిటల్ క్రాప్ సర్వే చేస్తారు. రైతులు సర్వే నంబర్, పంటల వారీగా వివరాలు నమోదు చేయించుకోవాలి.
– రవీందర్సింగ్, జిల్లా వ్యవసాయాధికారి
జిల్లాలో 125 గ్రామాలు, 55 క్లస్టర్లు
2,21,163 ఎకరాల్లో పంటల సాగు
రైతులు సాగు చేసుకుంటున్న పంటల వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేసుకోకుంటే పంట ఉత్పత్తుల విక్రయాల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన తర్వాత ఆన్లైన్లో ఉన్న సాగు విస్తీర్ణం మేరకు వచ్చే పంట దిగుబడి అంచనాకు సరితూగాలి. తేడాలుంటే పంట ఉత్పత్తుల విక్రయ చెల్లింపులు ఆలస్యమవుతాయి. ప్రభుత్వ పథకాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిహారం పొందడం, బీమా వర్తింపు వంటి సాయం అందించడానికి ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉంటుంది.

పక్కాగా పంటల లెక్క

పక్కాగా పంటల లెక్క