
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈనెలలో వస్తుందంటారా? జమిలీ ఎన్నికలపై నిపుణుల కమిటీ ఏం తేలుస్తోంది. ఇప్పట్లో అది సాధ్యం కాదట కదా..! షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం హైదరాబాద్కు ఎందుకు వస్తుంది. కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో కూడా భేటీ అవుతుంది కదా.. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందట కదా? అలాగైతే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నమాట’ ఎక్కడ నలుగురు కలిసినా.. ఇదే చర్చ. ఇంతకీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఎప్పుడొస్తాయనే విషయమై ఇంకా స్పష్టత రానప్పటికీ.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలు మాత్రం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు అధిష్టానం నుంచి అందినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలో 17 మంది సభ్యుల బృందం మంగళవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చేరుకోవడం కూడా ప్రచారానికి బలం చేకూరుస్తోంది. దీంతో సర్వత్రా ఎన్నికల షెడ్యూల్పైనే చర్చ జరుగుతోంది.
సర్వసన్నద్ధంగా అధికార యంత్రాంగం..
గత పోలింగ్ 2018 డిసెంబర్ 7న జరిగింది. ఇందుకోసం నవంబర్ 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని అక్టోబర్ 23న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను ప్రకటించింది. 2023 డిసెంబర్ 13న ప్రభుత్వం రద్దయ్యే అవకాశం ఉన్నందున ఆలోగా.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వీలుగా ఈసారి కూడా ఎన్నికల షెడ్యూల్ ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో.. కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం రాష్ట్రానికి చేరుకుంది. రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లాల ఉన్నతాధికారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించనుండడం షెడ్యూల్ ప్రకారమే.. ఎన్నికలు అనే వాదనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదిలా ఉండగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా.. ఎన్నికలు జరిపేలా ఉమ్మడి వరంగల్లోని 12 నియోజకవర్గాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారుగా 27.89 లక్షల పైచిలుకు ఓటర్ల కోసం 3,252 పోలింగ్ కేంద్రాలు, 5,890ల వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) సిద్ధం చేసినట్లు కూడా ప్రకటించారు. సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాల మార్కింగ్ చేశారు. జిల్లా కలెక్టరేట్లలో ఎన్నికల కేంద్రాలు, మీడియా సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈఏర్పాట్లతో పాటు ఎన్నికల సందర్భంగా అనుసరించా ల్సిన విధానా లపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేర కు ఉమ్మడి వరంగల్కు చెందిన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మంగళవారం హైదరాబాద్కు వెళ్లారు.
దూకుడు పెంచిన ప్రజాప్రతినిధులు, పార్టీలు
కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో కాలు మోపడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఉమ్మడి వరంగల్లో అధికార బీఆర్ఎస్తోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు దూకుడు పెంచారు. ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ అమల్లోకి రావొచ్చన్న సంకేతాలతో ఓ అడుగు ముందుకేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెండింగ్లో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు పెట్టుకుంటున్నారు. దీంతో మంత్రులతోపాటు ముఖ్యమంత్రి సహా అగ్రనేతల పర్యటనలతో జిల్లా హోరెత్తనుంది.
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈనెల 6న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్లో పర్యటించనున్నారు. హరీశ్, కేసీఆర్ కార్యక్రమాలు కూడా ఉమ్మడి జిల్లాలో ఉండనున్నాయి. అలాగే నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకుల పర్యటనలు, కార్యక్రమాలను మంగళవారం నుంచి మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే దరఖాస్తులు చేసుకుని టికెట్ల కోసం ఎదురుచూస్తున్న ఆ రెండు పా ర్టీల అభ్యర్థుల జాబి తా కూడా త్వ రలోనే వెలువడనుందన్న ధీమాను పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కేంద్ర ఎన్నికల కమిషన్ మూడ్రోజుల పర్యటన అన్ని రాజకీయ పార్టీల్లో వేడిని పెంచింది.