నేడు తొలి జాబితా? ఉమ్మడి జిల్లా నేతల్లో ఉత్కంఠ.. | - | Sakshi
Sakshi News home page

నేడు తొలి జాబితా? ఉమ్మడి జిల్లా నేతల్లో ఉత్కంఠ..

Aug 21 2023 1:46 AM | Updated on Aug 21 2023 9:19 AM

- - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపికపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపించడం.. నేడో, రేపో అభ్యర్థుల తొలి జాబితా విడుదలవుతుందన్న ప్రచా రంతో టికెట్ల పోరు రాజుకుంటోంది. చాలా నియోజకవర్గాల్లో ‘సిట్టింగ్‌’ల స్థానంలో ఎమ్మెల్సీల పేర్లు వినిపిస్తుండడంతో ఎమ్మెల్యేల అనుచరులు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు.

ఒక దశలో పోటాపోటీగా దిష్టిబొమ్మలను దహనం చేసే పరిస్థితి ఏర్పడింది. నిన్న, మొన్నటి వరకు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలకే పరిమితమైన నిరసనల పర్వం ఆదివారం భూపాలపల్లికి పాకింది. భూపాలపల్లి టికెట్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి ఇవ్వాలని చారి వర్గీయులు టవరెక్కారు. ఇదే సమయంలో పలుచోట్ల ‘ఎమ్మెల్సీలు వద్దు, ‘సిట్టింగ్‌’లే ముద్దు అని కొందరు.. సిట్టింగ్‌లు వద్దు.. ఎమ్మెల్సీలే ముద్దు అని మరి కొందరి పోటాపోటీ ఆందోళనలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.

రసకందాయంలో జనగామ రాజకీయాలు
తెలంగాణలో ఎక్కడా లేని విధంగా జనగామ నియోజకవర్గం రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందన్న ప్రచారంతో ఆ నియోజకవర్గం రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వాస్తవానికి ఏడాదిన్నరగా ముత్తిరెడ్డిని మారుస్తారన్న ప్రచారంతోపాటు ఆయన స్థానంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. జనగామ నియోజకవర్గంలో శ్రీనివాస్‌రెడ్డి తిరగడం కూడా ఇందుకు బలం చేకూరింది.

అయితే.. సడన్‌గా 10 రోజుల నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరు ఖరారైనట్లు బలంగా ప్రచారం జరుగుతుండడంతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హైదరాబాద్‌ నోమా హోటల్‌లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి బలప్రదర్శన చేశారు. జనగామలో ఆయన వర్గీయులు అయితే ముత్తిరెడ్డికి, లేదంటే పోచంపల్లికి ఇవ్వాలని.. ‘పల్లా వద్దే వద్దు’ అని నిరసనలకు దిగారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో పూజలు చేసి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో జనగామ బీఆర్‌ఎస్‌ రాజకీయాలు రసకందాయంలో పడగా.. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మధ్య టికెట్‌ పోరు రసవత్తరంగా మారింది.

చల్లారని ‘స్టేషన్‌’ మంటలు
స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య మాటల మంటలు చల్లారడం లేదు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందన్న ప్రచారంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్య సైతం నియోజకవర్గంలో పర్యటనల దూకుడు పెంచారు. ఓ వైపు శ్రీహరి, మరోవైపు రాజయ్య పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ద్వితీయ శ్రేణి ప్రజాప్రతినిధులు, క్యాడర్‌ పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్లుగా మారింది. ఇదే సమయంలో శ్రీహరి, రాజయ్య ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ప్రత్యక్ష, పరోక్ష ఆరోపణలు గతంలోకన్నా ఇప్పుడు తారస్థాయికి చేరడం.. అధిష్టానం వేచి చూసే ధోరణితో ఉండడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ క్యాడర్‌లో నెలకొంది.

భూపాలపల్లికి పాకిన సెగ..
కాగా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లకే పరిమితమైన టికెట్ల పోరు ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గంలో తీవ్రరూపం దాల్చింది. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి శనివారం ఎమ్మెల్సీ మధుసూదనాచా రిని కలిసేందుకు వెళ్లిన ఆయన అనుచరులు.. ఆదివారం భూపాలపల్లిలో టవరెక్కి గండ్ర వెంకట రమణారెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దని నిరసన తెలిపారు. ఉద్యమకారుడైన చారికే ఇవ్వాలని ఆయన అనుచరులు భూపాలపల్లితో పాటు శాయంపేట తదితర మండలాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మరో వైపు గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరులు సైతం సిట్టింగ్‌లకే ఇవ్వాలన్న వాయిస్‌ను వినిపించారు. దీంతో తాజా వివాదంపైనా అధిష్టానం ఆరా తీస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

తొలి జాబితా విడుదలపై ప్రచారం..
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సోమవారం (నేడు) తొలి జాబితా విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి వరంగల్‌లో ఎవరి సీట్లు పదిలం.. ఎవరి సీట్లకు ఎసరు వస్తుందో నన్న ఉత్కంఠ పలువురు ‘సిట్టింగ్‌’లలో మొదలైంది. ఇప్పటికే ఈసారి కూడా టికెట్‌ వారికేనన్న సంకేతాలందిన వారు తమ పనులు చక్కబెట్టుకుంటుండగా.. మార్పు తప్పదన్న సంకేతాలున్న వారు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సందిగ్ధంలో ఉన్న ‘సిట్టింగ్‌’లు ఓ వైపు ప్రయత్నాలు చేస్తూ.. మరోవైపు దేవుడిపై భారం వేసి పూజలు, యాగాలు చేస్తున్నారు.

పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిఽథ్యం వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు, దాస్యం వినయ్‌భాస్కర్‌, అరూరి రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి టికెట్లపై పూర్తిగా భరోసాతో ఉన్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ తూర్పులో అధిష్టానం అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయం తీసుకుందన్న ప్రచారం ఉంది. తాజాగా భూపాలపల్లిలో టికెట్‌ వివాదం తెరమీదకు రాగా.. దీంతోపాటు డోర్నకల్‌, మహబూబాబాద్‌లో కూడా మార్పులు ఉంటాయా? ‘సిట్టింగ్‌’లకే గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారా? అన్న అంశాలపై అధిష్టానం స్పష్టత ఇస్తేనే ఉత్కంఠ వీడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement