రాష్ట్ర అవతరణ వేడుకలకు సమీకృత కలెక్టరేట్ ముస్తాబైంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించే వేడుకల ఏర్పాట్లను సోమవారం ఏఓ భానుప్రకాశ్తో కలిసి కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఎక్కడా ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్రెడ్డి హాజరుకానున్నారు. ఉదయం 7:50 గంటలకు ఎస్పీ సునీతారెడ్డి, 7:53 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి చేరుకుంటారు. 7:55 గంటలకు వచ్చే ముఖ్య అతిథికి వారు పుష్పగుచ్ఛ అందజేసి ఆహ్వానించనున్నారు. అనంతరం ముఖ్య అతిథి జాతీయ జెండావిష్కరణ, తెలంగాణ గీతాలాపన, పోలీసు గౌరవ వందన స్వీకరణ అనంతరం జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు చదివి వినిపిస్తారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను శాలువాతో సత్కరిస్తారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వర్తింపజేస్తూ.. మంజూరు పత్రాల అందజేత, స్టాల్స్ సందర్శనతో కార్యక్రమం ముగుస్తుంది.


