మూస పద్ధతిలోనే పంటల సాగు
వనపర్తి: నేలల స్వభావం, వాతావరణం, మార్కెటింగ్, స్థానిక డిమాండ్ ఆధారంగా పంటల ఉత్పత్తులు, నీటి లభ్యత తదితర పరిస్థితుల ఆధారంగా వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకు రైతులు వివిధ రకాల పంటలు సాగుచేయడం ఆధునిక వ్యవసాయంగా చెప్పవచ్చు. కానీ జిల్లాలో దశాబ్ద కాలంగా మూస పద్ధతిలో ఒకేరకమైన పంటలు సాగు చేస్తుండటంతో మార్కెటింగ్, కూలీలు, ఎరువుల కోసం అవస్థలు తదితర ఘటనలు ఏటా పెరుగుతున్నాయి. ప్రస్తుత యాసంగిలో వరి ధాన్యం విక్రయించుకునేందుకు రైతులు పడుతున్న ఇబ్బందులు, రవాణాకు సొంత ట్రాక్టర్లను సైతం మిల్లుల వద్ద వరుసలో నిలబెట్టి రోజుల తరబడి ధాన్యం వద్దనే పడిగాపులు పడాల్సిన దుస్థితిని చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2.35 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే.. పండ్ల తోటలు, అక్కడక్కడ ఆయిల్పాం, చెరుకు మినహా.. సుమారు 1.95 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. దీంతో ప్రస్తుత యాసంగిలోనే సుమారు 3.75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం విక్రయానికి వస్తుందని అధికారుల అంచనా. కాగా 40 రోజుల్లో సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ కొనుగోలు చేసింది. మరో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలో వరి దిగుబడులు వచ్చినట్లు అధికారుల లెక్కలతో స్పష్టమవుతోంది. కాగా పప్పు దినుసులు, ఆకు, కూరగాయలు, నూనెగింజల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రోజూ కర్నూలు, బెంగుళూరు నుంచి కూరగాయాలు జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. కనీసం జిల్లాకు సరిపడా ఆకు కూరగాయలు సైతం ఇక్కడ పండించడం లేదు. పంటల వైవిద్యాన్ని పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నా.. అనాసక్తే చూపుతున్నారు.
పంటలు 2021–22 2022–23 2023–24 2024–25 2025–26
జొన్న 1,868 1,455 776 1,933 1298
మొక్కజొన్న 11,631 12,077 11,111 9,054 4,100
కంది 13,890 6,185 3,954 6,791 5,998
పెసర 226 58 5 47 69
మినుములు 651 227 399 1,044 1,206
వేరుశనగకు డిమాండ్..
జిల్లాలో పండించిన వేరుశనగ (పల్లీ)కి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. ఇందుకు కారణం ఇక్కడి వేరుశనగలో అఫ్లటాక్సిన్ అనే శిలీంద్రం లేకపోవడంతో ఎక్కువ కాలం నిల్వ ఉండటమే గాకుండా రంగు, రుచి మారదు. రెండేళ్ల కిందటి వరకు ఈ ప్రాంతంలో పండించిన వేరుశనగను యూరప్ దేశాలకు ఎగుమతి చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత నీటి లభ్యత పెరగడంతో మెట్ట పంటలు సాగుచేసే పొలాలను రైతులు వరి సాగుకు అనుగుణంగా మార్చడంతో ఏటా మెట్ట పంటల సాగు తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం మొక్కజొక్క, పత్తి, కంది, పెసర, శనగ, మినుము సాగు చాలా వరకు తగ్గిపోయింది.
పంటల వైవిధ్యంపై రైతుల అనాసక్తి
ఏటా తగ్గుతున్న మెట్ట పంటలు, కూరగాయల సాగు
‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంతోనైనాప్రయోజనం చేకూరేనా?
ఏటా వానాకాలంలో మెట్ట పంటల సాగు ఇలా.. (ఎకరాల్లో..)


