ఆత్మకూర్: విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్రమశిక్షణతో సాధించే దిశగా శ్రమిస్తూ ముందుకుసాగాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎంవీ రామన్ పాఠశాలలో నిర్వహించిన సమగ్ర విద్యా విజ్ఞాన ప్రదర్శన–2026ను మంత్రితో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై ప్రారంభించారు. మొత్తం 51 స్టాళ్లలో ప్రదర్శించిన 741 ప్రదర్శనలు, ఆవిష్కరణలను తిలకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేందుకు సైన్స్మేళాలు ఎంతోగానో దోహదపడతాయన్నారు. కష్టపడేతత్వం ఉంటే అనుకున్న లక్ష్యాలను అవలీలగా సాధించవచ్చని, తల్లిదండ్రులే నిజమైన హీరోలని, గురువులను గౌరవించిన వారు జీవితంలో ఏదైనా సాధిస్తారని వివరించారు. పట్టణంలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్న పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపాల్ అన్సీ శ్రీధర్, డైరెక్టర్ శ్రీధర్గౌడ్ను అభినందించారు.
ఉన్నతంగా రాణించాలి..
విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకొని క్రమశిక్షణతో చదివితే అనుకున్నది సాధించవచ్చని.. లక్ష్యంతో ముందుకెళ్లాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. జీవితంలో ఏ రంగాన్ని ఎంచుకున్నా అత్యత్తమంగా రాణించాలని, జిల్లా విద్యారంగానికి నిలయమని.. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా కు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి


