ఆత్మకూర్: పుర అభివృద్ధికి రూ.5.10 కోట్లతో ప్రణాళికలు రూపొందించామని.. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, కమిషనర్ చికినె శశిధర్ అన్నారు. మంగళవారం స్థానిక పుర కార్యాలయంలో 2026–27 వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. రూ.5.10 కోట్లతో బడ్జెట్ రూపొందించామని.. ఇందులో రూ.2.50 కోట్లు పన్ను రాబడి, పన్నేతర రాబడి రూ.2.25 కోట్లు, అసైన్డ్ ఆదాయం రూ.35 లక్షలుగా అంచనా వేశారు. పట్టణంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధిదీపాలు తదితర అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నామన్నారు. అన్నివార్డుల్లో సమానంగా అభివృద్ధి జరిగేలా కృషి చేస్తున్నామని.. పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిధులను పారదర్శకరంగా వినియోగించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తిరుపతయ్య, లలితరాజు, శంకరమ్మ బాలరాజు, దండు శ్రీను, భరత్, జిందె జ్యోతి శ్రీనివాస్, తులసి వెంకట్రాములు, జుబేదాబేగం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


