–8లో u
వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2న గ్రామసభలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గ్రామ, వార్డు, మున్సిపల్ సభల నిర్వహణపై సోమవారం ఉదయం కలెక్టరేట్లోని ప్రజావాణి సమావేశ మందిరం నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పుర కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించి ఏర్పాట్లు, సభ నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. గ్రామసభల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని, సోమవారమే ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు అందించడంతో పాటు గ్రామాల్లో టాం టాం వేయించాలన్నారు. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధులు తదితర విషయాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల కరదీపికలను గ్రామసభకు వచ్చే ప్రతి ఒక్కరికి అందజేయాలన్నారు. ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించాలని.. గ్రామసభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి సందేశం వీక్షించేలా టీవీ సైతం ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు ముందస్తు సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రూపొందించుకోవాలని కోరారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి..
ప్రజావాణి ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయనతో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య పాల్గొని ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులపై ఉందని.. ప్రస్తుత, పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన వాటిని సైతం వారంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణికి 35 వినతులు వచ్చాయని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో అన్నిశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


