కాంగ్రెస్లో కల్లోలం!?
మౌనం ఎందుకో..?
మున్సిపల్ ఎన్నికలు తెచ్చిన పంచాయితీ
వనపర్తి: స్థానిక పురపాలికలో అధికార కాంగ్రెస్ పార్టీలో పుర పీఠం కోసం ప్రారంభమైన కుమ్ములాట ఇంకా కొనసాగుతోంది. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక నాటి నుంచి నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తారాస్థాయికి చేరుతోంది. తన భార్యకు పుర చైర్పర్సన్ పదవి ఇస్తామని పార్టీపెద్దలు నమ్మక ద్రోహం చేశారని కాంగ్రెస్పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ ఆరోపించడంతో పాటు కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేసిన గంటకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన భార్య ఆర్డీఓ సుబ్రమణ్యంకు లిఖిత పూర్వకంగా పత్రం అందజేయడం, ఆయన కూడా పార్టీ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు మీడియా ఎదుట ప్రకటించటం దుమారం లేపినట్లయింది. రెండ్రోజుల పాటు నిమ్మకున్న కాంగ్రెస్ నేతలు డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 2014 పుర చైర్పర్సన్ ఎన్నిక సమయంలో పార్టీకి ద్రోహం చేశారని.. ఇప్పుడు చైర్పర్సన్ పదవి ఎలా అడుగుతావంటూ మరికొన్ని పాత విషయాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. చైర్పర్సన్ పదవి ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందనే ధోరణిలో ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించిన చీర్ల చందర్ శనివారం తన నివాసంలో మరోమారు విలేకర్ల సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ మంచోళ్లేనని.. తనపై ఆరోపణలు చేసిన ఆ నలుగురు నాయకుల తీరే సక్రమంగా లేదంటూ, పార్టీకి దశాబ్దాలుగా తన కుటుంబం సేవలు చేశామని, కొందరు మెప్పు కోసం తనపై బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. వారం రోజులుగా కాంగ్రెస్ నేతల్లో నెలకొన్న కల్లోలం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ విషయంపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి నోరు మెదపకపోవడం.. పార్టీ పట్టణ అధ్యక్షుడి పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా శాంతి చర్చలు జరపకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. అగ్ర నాయకులు ఆయన్ను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? లేక ఆయనే దిగి వస్తారనే ధీమాలో ఉన్నారా? అనే విషయంపై స్పష్టత లేదు.
వనపర్తి చైర్పర్సన్ పదవి చుట్టూ
రాజకీయం
పార్టీ పట్టణ అధ్యక్షుడు, అతడి భార్య కౌన్సిలర్ రాజీనామా
నేతల మధ్య మాటల యుద్ధం
ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడి మౌనం
ఎందుకో?


