పేదల సొంతింటి కల సాకారం
వనపర్తి రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరై వారి సొంతింటి కల సహకారం అవుతుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం శ్రీరంగాపురం మండలం తాటిపాములతండాలో రాజునాయక్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి ఆయన హాజరై నూతన దుస్తులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తిరిగి వెళ్తూ మార్గంలో వరి నాట్లు వేస్తున్న మహిళలను ఆప్యాయంగా పలకరించి కాసేపు ముచ్చటించారు. అలాగే పెబ్బేరులోని 10 వార్డులో పద్మమ్మ వెంకటేష్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి హాజరై దుస్తులు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేసి సొంతింటి కలను సాకారం చేసిందని.. చాలా సంతోషంగా ఉందని లబ్ధిదారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఇళ్లు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట పుర చైర్మన్ అక్కి శ్రీనివాస్గౌడ్, మార్కెట్ చైర్పర్సన్ గౌని ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్రెడ్డి, తాటిపాముల సర్పంచ్ శిరీష మద్దిలేటి, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు రాములుయాదవ్, ఉపసర్పంచ్ కురుమన్న, కౌన్సిలర్ శివసాయి, పార్టీ నాయకులు సుఖ్యానాయక్, రాజగౌడ్, వాసుదేవారెడ్డి తదితరులు ఉన్నారు.
అంగన్వాడీ పోస్టులు భర్తీ చేయాలి
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని జిల్లా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆదివారం జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, కనీస వేతనం అమలు చేయాలని కోరారు. గ్రామాల్లో బీఎల్వోలుగా ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఎమ్మెల్యేకు వివరించారు. అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.


