ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం కోతలు ప్రారంభం
పంట విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే..
ఉమ్మడి జిల్లాలో 28,999 ఎకరాల్లోపంట సాగు
నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఆయిల్పాం పరిశ్రమ లేకపోవడంతో పంట విక్రయానికి వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు.
● 2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతులు ఆయిల్పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారులు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్పాం సాగవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్పాం గెలలను తరలించాల్సి వస్తోంది.
పంట కోతలు ప్రారంభం..
ఉమ్మడి జిల్లాలో పంట కోతలు ప్రారంభమయ్యాయి. నారాయణపేట జిల్లాలో 130 టన్నులు, వనపర్తిలో 600, గద్వాల జిల్లాలో 300, మహబూబ్నగర్ జిల్లాలో 260 టన్నుల దిగుబడి రాగా.. నాగర్కర్నూల్ జిల్లాలో ఇప్పడిప్పుడే పంట కోత ప్రారంభమైంది. ఈ ఏడాది ఆయిల్పాం ధర పెరిగింది. గతేడాది టన్ను రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ. 21 వేల వరకు ధర పలుకుతోంది. ఏడాది పాటు కాపు కాస్తుండటంతో రైతులు గెలలను విక్రయించేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే ప్రతి 30 కి.మీ. ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు.
పరిశ్రమలు ఉంటేనే ప్రయోజనం..
పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు. కాగా.. ఇటీవల నారాయణపేట జిల్లాలో ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు.

ఆయిల్పాం కష్టాలు తీరేనా!