
జాగ్రత్తలతోనే నియంత్రణ
ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు నమోదు కాలేదు
ప్రశ్న: కరోనా బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– రాకేష్, దుప్పల్లి (మదనాపురం)
డీఎంహెచ్ఓ: ఇతర దేశాల నుంచి వస్తున్న వారి నుంచి జెన్–1 కరోనా వేరియంట్ వ్యాపిస్తుంది. విదేశాల నుంచి వచ్చే వారికి దూరంగా ఉండటంతో పాటు మాస్క్లు ధరించాలి. వారి ఆరోగ్య పరిస్థితిని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.
ప్రశ్న: వైరస్ వ్యాప్తిని ఎలా గుర్తించాలి.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? – రామకృష్ణ, వనపర్తి
డీఎంహెచ్ఓ: మందులు వాడినా జ్వరం, దగ్గు, జలుబు తగ్గకుంటే వైరస్ సోకినట్లుగా భావించాలి. ఆర్టీపీసీఆర్ ద్వారా వైరస్ను గుర్తించవచ్చు. పౌష్టికాహారం, వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే తగ్గిపోతుంది.
ప్రశ్న: జిల్లావ్యాప్తంగా ఎక్కడైనా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారా?
– రాములు, బుసిరెడ్డిపల్లి (పాన్గల్)
డీఎంహెచ్ఓ: ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా వ్యాధి లక్షణాలు బయటపడలేదు. ప్రస్తుత వేరియంట్ జెన్–1 సోకినట్లు నిర్ధారణ కాకపోవడంతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయలేదు. అవసరాన్ని బట్టి ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో కేవలం సింగిల్ డిజిట్ కేసులు నమోదు కావడంతో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు ఉత్పన్నం కావు.
ప్రశ్న: గతంలో కరోనా సమయంలో భయాందోళనకు గురయ్యాం.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలా? – శ్రీనివాసులు, పెబ్బేరు
డీఎంహెచ్ఓ: తొలిసారి కరోనా ప్రభావం తక్కవే అయినా.. ప్రజల భయాందోళనలతో ఎక్కువ ప్రాణ నష్టం కలిగింది. ఇప్పటికే రెండుసార్లు వైరస్ ప్రభావం చూశాం. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాం. భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రాంతంలోని ప్రజల్లో రోగ నిరోధకశక్తి చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం రూపాంతరం చెందిన జెన్–1 వైరస్ మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం లేదు.
ప్రశ్న: సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – బాల్యానాయక్,
తెల్లరాళ్లపల్లి తండా (పాన్గల్)
డీఎంహెచ్ఓ: ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. అనారోగ్యం బారిన పడితే సమీప ఆస్పత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలి. ప్రాథమిక దశలో ఉన్నప్పుడే సరైన వైద్యం తీసుకోవాలి. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పౌష్టికాహారంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.
కరోనా రూపాంతరం చెంది మళ్లీ విజృంభిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు సూచించారు. జెన్–1 వేరియంట్ రూపంలో కరోనా వ్యాపిస్తున్నందున శనివారం జిల్లా వైద్యాధికారితో ‘సాక్షి’ ఫోన్–ఇన్ నిర్వహించింది. జిల్లా నలుమూలల నుంచి పలువురు ఫోన్లో తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్రంలోని కొన్నిచోట్ల జెన్–1 వేరియంట్ వైరస్ సోకినా.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కేసుకూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లా ప్రజలు రెండు విడతలుగా వైరస్ విజృంభణ చూశారని, వాటి బారిన పడకుండా రక్షణగా రెండు దఫాలు వ్యాక్సిన్ సైతం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న కరోనా వైరస్ తీవ్రత ప్రమాదకరంగా లేదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని తెలిపారు. – వనపర్తి
ప్రస్తుత వైరస్ తీవ్రత తక్కువే..
భయపడాల్సిన అవసరం లేదు
జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు
ప్రశ్న: ఆహార అలవాట్లలో మార్పులు అవసరమా? – విష్ణు, గోపాల్పేట
డీఎంహెచ్ఓ: ఆహారపు అలవాట్లలో మార్పులు అవసరం లేదు. రోజువారీగా కొద్దిపాటి పౌష్టికాహారం, వ్యాయామం చేస్తే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ఎలాంటి వైరస్లు మీ దరికి చేరవు.

జాగ్రత్తలతోనే నియంత్రణ