
ఒకేసారి మూడు నెలల రేషన్
●
● కేంద్రం నిర్ణయంతో ముందుకు..
● రేషన్ దుకాణాలకు బియ్యం తరలింపు
● నిల్వ చేసుకునేందుకు స్థలం కరువు.. ఇబ్బందులు పడుతున్న డీలర్లు
పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం..
ప్రభుత్వ ఆదేశానుసారం మూడునెలల రేషన్ బియ్యం ఈ నెల 30వ తేదీలోగా లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని డీలర్లుక ఆదేశాలిచ్చాం. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నాం. ఎక్కడా ఫిర్యాదులు, పొరపాట్లకు తావులేకుండా ప్రజాపంపిణీ చేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. – కాశీవిశ్వనాథ్,
జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి
వనపర్తి: కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లావ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాలకు మూడునెలల బియ్యం కోటా ఒకేసారి ఎంఎల్ఎస్ గోదాం నుంచి తరలిస్తున్నారు. బియ్యం తరలింపును పౌరసరఫరాలశాఖ అధికారులతో పాటు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మూడు నెలల కోటా నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులు ఆయా రేషన్ డీలర్లు, అధికారులు, ఎంఎల్ఎస్పీ గోదాంల ఇన్చార్జ్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు. ఒక్కో కార్డుదారుడి నుంచి మూడుసార్లు వేలిముద్రలు తీసుకొని బియ్యం పంపిణీ చేయాలని అధికారులు నిబంధనలు రూపొందించారు. వాతావరణ మార్పులను ముందస్తుగా అంచనా వేసిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సన్న బియ్యం పంపిణీతో పెరిగిన ఆసక్తి..
రెండునెలలుగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో 90 శాతం మంది లబ్ధిదారులు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో దొడ్డురకం బియ్యం పంపిణీ చేస్తుండటంతో చాలావరకు రేషన్ దుకాణాల నుంచి రీసైక్లింగ్ అయ్యేవి. ప్రస్తుతం సన్నబియ్యం పంపిణీతో పరిస్థితులు పూర్తిగా మారినట్లు క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. సన్న బియ్యం పంపిణీతో ప్రజాపంపిణీ లక్ష్యం నెరవేరుతోందని అఽధికారులు సైతం కితాబిచ్చారు.
ఈ నెల 30 వరకు గడువు..
ఈ నెల 30వ తేదీలోగా జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగష్టు బియ్యం కోటాను రేషన్ డీలర్లు పంపిణీ చేయాలి. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సిన మౌలిక వసతులు సమకూర్చుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులు డీలర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
లబ్దిదారులు 5,58,334
అంత్యోదయ కార్డులు 10,514
మూడునెలల కోటా
10,555.422
మెట్రిక్ టన్నులు
అన్నపూర్ణ కార్డులు
109
బియ్యం నిల్వకు స్థలాలు కరువు?
జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రేషన్ దుకాణాల్లో ఒకనెల కోటా బియ్యం పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునేందుకు సరిపడా స్థలం లేదు. ఏకంగా ఒకేసారి మూడు నెలల కోటా నిల్వ చేసుకునేందుకు అదనంగా సమీపంలో మరో దుకాణం లేదా గోదాం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. బియ్యం పంపిణీపై ఆయా మండలాల తహసీల్దారు నిశితంగా పర్యవేక్షణ చేస్తున్నారు.

ఒకేసారి మూడు నెలల రేషన్