ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన

Jun 5 2025 2:11 AM | Updated on Jun 5 2025 2:11 AM

ఫ్యాక

ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన

రాజోళి/మానవపాడు: ‘12 గ్రామాలకు ఇబ్బందిగా మారిన ఈ ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దు.. పచ్చని పల్లెల్లో ఫ్యాక్టరీ చిచ్చు పెట్టొద్దు.. ఈ విషయం ఎన్నో సార్లు ఫ్యాక్టరీ వారికి చెప్పాం.. శాంతియుతంగా నిరసన దీక్షలు చేపట్టాం.. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులకు విన్నవించాం.. అయినా మా మాట లెక్కచేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారు’ అంటూ సహనం కోల్పోయిన స్థానికులు సదరు ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. సామగ్రితో వచ్చిన కంటైనర్‌తో పాటు అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, షెడ్లకు నిప్పు పెట్టారు. ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. గతేడాది అక్టోబర్‌ నుంచి శాంతియుతంగా కొనసాగుతున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ వ్యతిరేక నిరసన కాస్తా.. బుధవారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

గతేడాది అక్టోబర్‌ నుంచి రిలే దీక్షలు..

జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడలో 27.5 ఎకరాల భూమిని గాయిత్రి ఇథనాల్‌ ప్యూయల్స్‌ ఫ్యాక్టరీ కొనుగోలు చేసింది. అక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారనే విషయం అప్పటి వరకు ఎవరికీ తెలియదు. గతేడాది అక్టోబర్‌లో ఫ్యాక్టరీ యాజమాన్యం అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా గ్రామస్తులు కొన్ని రోజుల తర్వాత, ఇతర గ్రామాలతో కలిసి ఫ్యాక్టరీ ఏర్పాట్లుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో తమకు ఇబ్బంది కలుగుతుందని చుట్టు పక్కల 12 గ్రామాల ప్రజలతో కలిసి తమ కార్యాచరణను ప్రకటించారు. అందులో భాగంగా నిరసనలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు వినతులు అందజేశారు. అనంతరం ఈ ఏడాది జనవరి 23న రిలే నిరాహార దీక్షను ప్రారంభించి ఫిబ్రవరి 11న విరమించారు. ఆ సమయంలో అధికార పార్టీ నాయకులు, అధికారులు ఫ్యాక్టరీ విషయంలో తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా కృషి చేస్తామని మాట ఇచ్చి తమతో దీక్ష విరమింపచేశారని.. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇంతదాకా వచ్చిందని వ్యతిరేక పోరాట సమితి సభ్యులు పేర్కొన్నారు.

గ్రామస్తులకు గాయాలయ్యాయి

పనులు చేపట్టవద్దని అడగడానికి వెళితే వారు చెప్పిన సమాధానాలు, మాట్లాడిన తీరు వల్ల ఇంతటి పరిస్థితికి దారి తీసింది. ప్రైవేట్‌ వ్యక్తులు దాడులు చేశారు. అందులో గ్రామస్తులకు గాయాలయ్యాయి. పచ్చని పంటలను దెబ్బతీసే ఫ్యాక్టరీ వద్దని చెబుతుంటే, వారు మాపై దాడులు చేస్తే భవిష్యత్తులో మా పరిస్థితి తలుచుకుంటే భయమేస్తుంది.

– శ్యాం ప్రసాద్‌, పెద్ద ధన్వాడ

పికెటింగ్‌ ఏర్పాటు చేశాం

ఫ్యాక్టరీకి సంబందించిన వారు అన్ని అనుమతులు తెచ్చుకున్నారు. వాటి ఆధారంగా పెద్దధన్వాడలో పనులు చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటన చోటుకుంది. మళ్లీ గ్రామంలో అలజడి రేగకుండా పోలీస్‌ పికెటింగ్‌ ఏర్పాటు చేశాం.

– మొగిలయ్య, డీఎస్పీ, గద్వాల

పరిశ్రమకు సంబంధించి

కంటైనర్‌, టెంట్లు, షెడ్లకు నిప్పు..

వాహనాలు ధ్వంసం

పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టొద్దంటూ ఆగ్రహం

రాజోళి మండలం పెద్దధన్వాడలో

తీవ్ర ఉద్రిక్తత

ఫ్యాక్టరీ పనుల ప్రారంభంతో ఆగ్రహం

ఈ క్రమంలో మంగళవారం ఫ్యాక్టరీ స్థలం వద్దకు సామగ్రితో కూడిన వాహనాలు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకొని ధర్నా చేపట్టగా పోలీసులు కలగజేసుకొని తిప్పిపంపారు. బుధవారం సైతం పనులు కొనసాగడం, పోలీసులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో విషయం తెలుసుకొని అక్కడి సిబ్బందితో గ్రామస్తులు మాట్లాడే క్రమంలో గొడవ మొదలైంది. ఒక్కసారిగా సహనం కోల్పోయిన దాదాపు 400 మంది గ్రామస్తులు కర్రలు, రాళ్లతో మూకుమ్మడిగా ఫ్యాక్టరీకి సింబంధించిన ఆస్తులపై దాడులకు పాల్పడ్డారు. టెంట్లు, షెడ్లు నేలకూల్చి వాటితోపాటు కంటైనర్‌కు నిప్పుపెట్టారు. జేసీబీ, కార్లను ధ్వంసం చేశారు. పలువురికి గాయాలయ్యాయి. చివరికి పోలీసులు గ్రామస్తులను శాంతింపజేసి వెనక్కి పంపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా.. బుధవారం సాయంత్రం తర్వాత పెద్ద ధన్వాడ చుట్టూ ఉన్న గ్రామాలకు చెందిన 45 మంది రైతులకు పోలీసులు అదుపులోకి తీసుకొని.. మానవపాడు స్టేషన్‌కు తరలించారు. ఆధార్‌కార్డులు, ఫోన్‌ నంబర్లను తీసుకొని రాత్రి 10 గంటల తర్వాత 35 మంది రైతులను పోలీసులు వదిలేశారు. మిగిలిన పదిమంది ఇంకా వారి అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన 1
1/2

ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన

ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన 2
2/2

ఫ్యాక్టరీ వద్దంటూ గ్రామస్తుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement