
భక్తిశ్రద్ధ్దలతో బక్రీద్
వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా శనివారం ముస్లిం సోదరులు బక్రీద్ను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకొన్నారు. జిల్లాకేంద్రం శివారు గోపాల్పేట రహదారిలో ఉన్న ఈద్గాలో ముస్లింలు ప్రార్థనలు చేశారు. అదేవిధంగా తొలిసారి శ్రీనివాసపురంలో ముస్లింలకు కేటాయించిన స్థలంలో కూడా పలువురు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ముస్లింలు పట్టణం నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఈద్గాకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి శ్రీనివాసపురంలో, మాజీ మంత్రి నిరంజన్రెడ్డి తన నివాసంలో ముస్లింలను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనీరతి, సహనానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారని ఎమ్మెల్యే మేఘారెడ్డి వివరించారు. విశ్వాసం, నమ్మకం, పరోపకారానికి బక్రీద్ ప్రతీక అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ముస్లీంలకు వివిధ పార్టీల ప్రముఖులు, అధికారులు, మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, చీర్ల విజయచందర్, వెంకటయ్య యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈద్గాల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
జిల్లాకేంద్రంలో తొలిసారిగా శ్రీనివాసపురం ప్రాంతంలో కేటాయించిన స్థలంలో నమాజ్
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మేఘారెడ్డి