
మరుగునపడిన మలశుద్ధి
జిల్లాకేంద్రంలో కర్మాగారం ఏర్పాటుకు పడని అడుగులు
ఆదాయ సమీకరణకు..
గ్రామాలు, పట్టణాల్లో మానవ వ్యర్థాలను యథేచ్ఛగా కాల్వల్లోకి వదులుతున్నారు. దీంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని.. దీనిని శాశ్వతంగా నిర్మూలించేందుకు పురపాలికల్లో కర్మాగారాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మల శుద్ధి కర్మాగారాల ద్వారా ఎరువు తయారు చేసే విధానం అమలులోకి తేవాలని భావించింది. ఈ ప్రక్రియ ద్వారా వచ్చే ఎరువును మొక్కలు, రైతులు పంటలకు సేంద్రియ ఎరువుగా వినియోగించుకోవచ్చు. ఎరువు విక్రయంతో పురపాలికకు కూడా ఆదాయం సమకూరనుంది. ఈ విధానం ఇప్పటికే వరంగల్, రాజన్న సిరిసిల్లలో అమలువుతున్నందున మిగతా పురపాలికలకు విస్తరించనున్నారు. కానీ ఆ దిశగా పురపాలికలో ఇప్పటి వరకు అడుగులు పడకపోవడం శోచనీయం. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారిస్తే త్వరలోనే ప్రారంభం కానుంది.
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రానికి ఐదేళ్ల కిందట మలశుద్ధి కర్మాగారం మంజూరైంది. అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా మొదట పురపాలికలోని నాగవరం శివారులో ఎకరా స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలం కేంద్రం నిర్మాణానికి అనువుగా లేదని అధికారులు నిర్ణయించడంతో రెండేళ్ల కిందట పాన్గల్ రోడ్లో కేటాయించారు. అప్పటి నుంచి పనులు చేపట్టేందుకు ఏజెన్సీ ముందుకు రాకపోవడం.. తర్వాత బదిలీపై వచ్చిన అధికారులు అవగాహన లేమితో మిన్నకుండటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. 2022, ిఫిబ్రవరి 18న పుర బడ్జెట్ సమావేశంలో మలశుద్ధి కర్మాగారం నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదని కలెక్టర్ పుర అధికారులను ప్రశ్నించగా ఏజెన్సీ ముందుకు రావడం లేదని సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని సీడీఎంఏ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయా లని ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్లోని పాత పురపాలికల్లో మానవ వ్యర్థాల రీసైక్లింగ్ చేసేందుకు ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది.
చర్యలు చేపడతాం..
జిల్లాకేంద్రంలో మలశుద్ధి కర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన దస్త్రాలను ఇంజినీరింగ్ విభాగం నుంచి తీసుకుంటాం. గతంలో ప్రక్రియ ఎక్కడి వరకు జరిగింది.. ఎందుకు నిలిచిపోయింది.. స్థలం కేటాయింపు, నిర్మాణం, ప్రభుత్వ ఆదేశాలను అధ్యయనం చేస్తాం. ఉన్నతాధికారులకు విన్నవించి వారి ఆదేశానుసారం ముందుకు సాగుతాం. – ఎన్. వెంకటేశ్వర్లు, పుర కమిషనర్, వనపర్తి
ఐదేళ్ల కిందటే ఎకరా స్థలం కేటాయింపు..
పట్టించుకోని అధికారులు
నిర్మాణానికి నోచుకోని వైనం

మరుగునపడిన మలశుద్ధి