
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
వనపర్తి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వైద్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. సీజనల్ వ్యాధులు, క్షయ, మధుమేహం గుర్తించడం, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. వర్షాకాలంలో డెంగీ, మలేరియా, చికున్ గున్యా, వాంతులు, విరేచనాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఎప్పటికప్పుడు ఫీవర్ సర్వేలు చేపట్టడంతో పాటు రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. మధుమేహం, క్షయ వ్యాధిగ్రస్తులకు అందించే వైద్యం, వాడుతున్న మందులపై నివేదిక తయారుచేసి ఆన్లైన్ పోర్టల్లో నిక్షిప్తం చేస్తూ వైద్యచికిత్సలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకునే ప్రత్యేక యాప్ జూన్ 20 వరకు అందుబాటులోకి వస్తుందని, అవసరమైన అన్ని వివరాలు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాలపై సమీక్షిస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ఏఎన్సీ వైద్య పరీక్షలు సమయానుసారం నిర్వహిస్తూ ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. శ్రీనివాసులు, ప్రోగ్రాం అధికారులు డా. సాయినాథ్రెడ్డి, డా. రామచందర్రావు, డా. పరిమళ, ఇతర ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.