
నూనెగింజల సాగుతో లాభాలు
అమరచింత: రైతులు నూనెగింజల పంటలు సాగుచేస్తే అత్యధికంగా లాభాలు పొందవచ్చని జాతీయ నూనెగింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డా. సురేష్ తెలిపారు. వికసిత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని పాంరెడ్డిపల్లి, కొంకన్వానిపల్లిలో రైతులకు నూనెగింజల సాగుపై అవగాహన కల్పించారు. పంటల సాగులో ఏవైనా సందేహాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని.. ఇక్కడే పరిష్కరించే అవకాశం ఉంటుందని, రైతుల అభిప్రాయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆముదంలో ఐసీహెచ్–5 హైబ్రిడ్ రకం ఉందని తక్కువ కాల పరిమితితో అధిక దిగుబడి పొందడానికి వీలుగా తయారు చేసినట్లు చెప్పారు. ఈ విత్తనాలు మదనాపురం కేవీకేలో అందుబాటులో ఉన్నాయన్నారు. భూ సారం పెంచుకోవడానికి రైతులు జీలుగ, పచ్చరొట్ట సాగుచేసి పూతదశలో భూమిలో కలియ దున్నాలని సూచించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డా. అనిత, ఏఓ అరవింద్, ఏఈఓ శివ, రైతులు పాల్గొన్నారు.