
అభివృద్ధి పథం
ప్రత్యేక రాష్ట్రంలో అన్నిరంగాల్లో జిల్లా పురోగతి
650 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రి..
ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా నాటి వంద పడకల ఏరియా ఆస్పత్రి నేడు 650 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రిగా సర్కారు తీర్చిదిద్దింది. పేదలు ప్రసవాలకు ప్రైవేట్ను ఆశ్రయించి రూ.వేలు ఖర్చు చేయకుండా వాటికి ధీటుగా సాధారణ, సిజేరియన్ కాన్పులు చేస్తూ సర్కారు వైద్యంపై భరోసా కల్పిస్తున్నారు. ఒక్క జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రతి నెల 400కు తగ్గకుండా ప్రసవాలు జరుగుతున్నాయి. దీంతోపాటు క్యాన్సర్ కేర్, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలకు దీటుగా జిల్లాకేంద్రంలో ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో సుమారు 80 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా వైద్యుల సూచన మేరకు చేస్తుండడం గమనార్హం. స్వరాష్ట్రంలో ప్రతిరంగంలో జిల్లా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు జిల్లా ప్రగతి నివేదికతో వెల్లడవుతోంది.
వనపర్తి: పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో జిల్లా వ్యవసాయ, విద్య, వైద్యం తదితర అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వ్యవసాయ ఉత్పత్తులు నాలుగింతలు పెరిగినట్లు ప్రస్తుతం ఉమ్మడి పాలమూరులోనే అత్యధికంగా కొనుగోలు చేస్తున్న వరి ధాన్యంతో స్పష్టమవుతోంది. పదేళ్ల కిందటి వరకు వానాకాలంలో 78 వేల ఎకరాలు, యాసంగిలో 34 వేల ఎకరాల్లో వరి సాగవుతుండగా.. ప్రస్తుతం వానాకాలంలో 1.94 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరి సాగు, ఉత్పత్తి నాలుగింతలు పెరగడంతో జిల్లాను రైస్బౌల్గా స్థానిక ప్రజలు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో ఏకంగా 3.98 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ధేశించుకోవడం గమనార్హం. ఇందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా నిర్మించిన భీమా, కేఎల్ఐతో పాటు జూరాల వరద నీటితో చెరువులు, రిజర్వాయర్లను నింపుతుండటంతో భూగర్భ జలాలు పెరగడం, నీటిని ఎక్కువగా నిల్వ చేసుకొని అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవడం, కొత్త కాల్వలను పాత కాల్వలకు అనుసంధానంగా నిర్మాణం చేసుకోవడంతోనే సాధ్యమైందని చెప్పవచ్చు.
పదేళ్లలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
ప్రభుత్వ వైద్య, ఇంజినీరింగ్, ఫిషరీస్ తదితర కళాశాలల ఏర్పాటు
క్యానర్స్కేర్, ప్రసూతి, డయాలసిస్, 650 పడకల ఆస్పత్రి నిర్మాణం
2016–17తో పోలిస్తే నాలుగింతలు పెరిగిన వరి పంటలు

అభివృద్ధి పథం