
ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లిస్తే చర్యలు
వనపర్తి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీల నిధులు, వాటాలు కచ్చితంగా వారికే అందేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా అధికారులు, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, సంఘం నాయకులతో జిల్లాస్థాయి సమీక్ష జరిగింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలెక్టరేట్లోకు చేరుకోగానే ఎస్పీ, అదనపు కలెక్టర్లు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సమీక్షలో పాల్గొని ప్రభుత్వపథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన వాటాపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి నెల 30న పౌర హక్కుల దినోత్సవం విధిగా నిర్వహించాలని, ఇందుకు సంబంధించి ఏడాది ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. పౌర హక్కుల దినోత్సవం మొక్కుబడిగా కాకుండా గ్రామ చావడి, గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించాలని.. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, మీడియాకు ముందుగా సమాచారం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంక్షేమ పథకాలు ఎలా పొందవచ్చనే విషయాలపై అవగాహన కల్పించాలని, సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతోపాటు ప్రతి మూడు నెలలకు ఓసారి కలెక్టర్ అధ్యక్షతన విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం తప్పక నిర్వహించాలని, లేనిపక్షంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వారి అభ్యున్నతికి మాత్రమే కేటాయించాలని, నిధులను దారి మళ్లిస్తే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో క్రిమినల్ కేసుల సంఖ్య ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా తక్కువని.. జిల్లా పోలీసుశాఖ మంచి పనితీరుతోనే సాధ్యమైందని అభినందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉండాలని.. ఎస్సీ, ఎస్టీలు ఆత్మగౌరవం కోసం భావోద్వేగంతో ఉంటారని, పోలీసులు వారితో స్నేహపూర్వకంగా మెలిగి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం నిర్వహించే రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు పరిష్కరించి భూ సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ను కోరారు. ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల కేటాయింపులు పారదర్శకంగా చేపట్టాలని.. జిల్లాకేంద్రంలో బాబు జగ్జీవన్రామ్ విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సంఘం నాయకులు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల సమస్యలు కమిషన్ దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తామని భరోసానిచ్చారు.